|
రెండు జట్లకూ కీలకమే..
ఇప్పటికే దాదాపుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న ఆస్ట్రేలియా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఈ సిరీస్లో కనుక టీమిండియా 4-0తో ఓడితే.. ఆసీస్ జట్టు దర్జాగా ఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కంటే టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే ఈ సిరీస్ స్వదేశంలో జరుగుతుండటం, సొంత గడ్డపై టీమిండియా అద్భుత రికార్డు మన జట్టుకు ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. స్వదేశంలో భారత్ను ఓడించడం చాలా కష్టమనే విషయం ప్యాట్ కమిన్స్ సేనకు కూడా తెలుసు.
|
టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత్ కూడా ఈ సిరీస్ను చాలా సీరియస్గా తీసుకుంటోంది. అందుకే శుక్రవారం నుంచే టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టింది. తొలి మ్యాచ్ జరిగే నాగ్పూర్లో భారత ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ షురూ చేశారు. చటేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్లు ఇక్కడ ముమ్మరంగా సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇటీవల తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్లో బంతితో అదరగొట్టిన రవీంద్ర జడేజా.. తను మ్యాచ్ ఫిట్నెస్ సాధించుకున్నానని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో జడేజా తన బ్యాటుతో ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను కూడా తన బ్యాటింగ్ను మెరుగు పరుచుకునేందుకు కఠోర సాధన చేశాడు.
నలుగురు స్పిన్నర్లలో ప్రాక్టీస్..
అలాగే స్పిన్ ఎదుర్కోవడంపై చాలా ఫోకస్ పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. నెట్స్లో నలుగురు స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, సాయి కిషోర్లతో ప్రాక్టీస్ చేశారు. సొంతగడ్డపై ఆడిన గత మూడు టెస్టు సిరీసులను భారత్ గెలిచింది. మరి ఆసీస్పై కూడా గెలిచి ఈ రికార్డును మరింత పటిష్టం చేసుకుంటుందేమో చూడాలి. అదే సమయంలో ఈ రికార్డు బ్రేక్ చేసి, టీమిండియా కొమ్ములు వంచాలని ఆసీస్ జట్టు కూడా చాలా పట్టుదలగా కనిపిస్తోంది.