వరల్డ్ కప్ ఉన్న సంవత్సరంలో మరోసారి టీమిండియాకు గాయాల బెడద తగిలింది. వన్డే టీంలో మిడిలార్డర్లో చాలా కీలకంగా మారిన కేఎల్ రాహుల్ ఈసారి వన్డే వరల్డ్ కప్ ఆడే దాఖలాలు కనిపించడం లేదు. కొన్నిరోజుల క్రితం ఐపీఎల్లో ఆడుతుండగా రాహుల్కు గాయమైన సంగతి తెలిసిందే. ఆర్సీబీతో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా రాహుల్ తొడ కండరాలు పట్టేశాయి.
ఆ తర్వాత ఈ గాయం సీరియస్ అని తేలింది. ఈ క్రమంలోనే అతనికి లండన్లో తొడ కండరాలకు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ ముగిసిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు చేరుకున్న అతను.. అక్కడే కోలుకుంటున్నాడు. అయితే అతను ఫుల్ ఫిట్నెస్ సాధించాలంటే ఇంకా సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారట.

అదే జరిగితే ఆగస్టులో ప్రారంభమయ్యే ఆసియా కప్లో రాహుల్ ఆడటం జరగదు. వరల్డ్ కప్ ఆడే జట్టుకు ఎంపికవ్వాలంటే ఆసియా కప్లో రాణించడం చాలా ముఖ్యం. అలాంటి టోర్నీని మిస్ అయితే.. రాహుల్ను నేరుగా వరల్డ్ కప్లోకి తీసుకోవడం దాదాపు జరగని పని. దీంతో అతను వరల్డ్ కప్ కూడా ఆడే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. అతని స్థానంలో వికెట్ కీపింగ్తోపాటు మిడిలార్డర్ బాధ్యతలను సంజూ శాంసన్కు అప్పగించే ఛాన్సులు ఉన్నాయి.
గతేడాది వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన సంజూ కచ్చితంగా వన్డే వరల్డ్ కప్లో ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో గాయపడిన అతన్ని కివీస్ సిరీస్కు సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఐపీఎల్లో కూడా సంజూ ఫర్వాలేదనిపించాడు. గతేడాది కేవలం 11 వన్డే మ్యాచులే ఆడిన సంజూ 330 పరుగులతో ఆకట్టుకున్నాడు.
సంజూతోపాటు ఇషాన్ కిషన్ కూడా టీమిండియా వద్ద ఉన్న మరో ఆప్షన్. అయితే అతను ఓపెనింగ్ బ్యాటర్ కావడంతోపాటు.. మిడిలార్డర్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆసియా కప్తోపాటు వరల్డ్ కప్లో కూడా మిడిలార్డర్ బ్యాటర్గా సంజూకు అవకాశం దక్కుతుందని నిపుణుల అభిప్రాయం. విండీస్ టూర్లో కనుక సంజూ రాణిస్తే.. జట్టులో అతని స్థానం దాదాపు గ్యారంటీ అంటున్నారు.