బీసీసీఐ సంచలన నిర్ణయం: టీమిండియాకు డబుల్ షాక్!
Team India Squad: ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్తో జరగనున్న 3 వన్డేల సిరీస్, జింబాబ్వేతో జరగనున్న 3 టీ20ల సిరీస్ల కోసం భారత జట్టులో కీలక మార్పులను బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్కు ముందు భారత్కు రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యారు. వారి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్లకు జట్టులో చోటు దక్కింది.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నుంచి హర్షిత్ రాణా ఔట్
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా తన కుడి తొడ కండరంలో అకస్మాత్తుగా నొప్పిని అనుభవించాడని.. స్కానింగ్లో గ్రేడ్ 1 హ్యామ్స్ట్రింగ్ గాయం నిర్ధారణ అయిందని నేడు(జులై 12) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు హర్షిత్ రాణా దూరమయ్యాడు. తదుపరి వైద్య పరీక్షలు, పునరావాసం కోసం హర్షిత్ రాణా ఇప్పుడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నాడు. ఈ పరిస్థితిలో, హర్షిత్ స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను భారత వన్డే జట్టులోకి తీసుకున్నారు. ప్రిన్స్ యాదవ్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో అరంగేట్రం చేసి, అక్కడ రెండు మ్యాచ్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే హర్షిత్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి సిరాజ్ భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు.

జింబాబ్వే పర్యటనకు వరుణ్ చక్రవర్తి దూరం
అదే మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఎడమ కాలి తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో అది గ్రేడ్ 2 తొడ కండరాల గాయంగా తేలింది. వైద్య సలహా మేరకు జింబాబ్వేతో జరగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు వరుణ్ చక్రవర్తిని దూరం పెట్టారు. వరుణ్ చక్రవర్తి కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కు హాజరవుతాడు, అక్కడ వరుణ్ చక్రవర్తి కోలుకునేవరకు పర్యవేక్షిస్తారు. ఫలితంగా అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను భారత టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా రవి బిష్ణోయ్ భారత జట్టులో భాగంగా ఉన్నాడు.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.
జింబాబ్వే టీ20 సిరీస్ కోసం భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications