
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (జనవరి 13)న సెంచూరియన్ వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి లేని విధంగా స్టేడియం సిబ్బంది ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆర్మీ, నేవీ సిబ్బంది ప్రత్యేకంగా ఓ ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం 21సార్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం ఇవ్వనునన్నారు. అయితే ఇలా చేయడం దక్షిణాఫ్రికాలో మొట్టమొదటిసారి ఏం కాదు. గతంలో దక్షిణాఫ్రికాలో రగ్బీ మ్యాచ్ల ప్రారంభానికి ముందు ఇలా చేసేవారు.
ఇప్పుడు తొలిసారి ఓ క్రికెట్ మ్యాచ్కి ఇలాంటి ప్రదర్శన చేస్తున్నారు. అంతకముందు ఏ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇలా చేయలేదు. రెండో టెస్టు మ్యాచ్ సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్కు మైదానంలో శనివారం మధ్యాహ్నం దక్షిణాఫ్రికా రక్షణ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఇప్పటికే రక్షణశాఖ సిబ్బంది ఈ మ్యాచ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తాజాగా ఆర్మీ, నేవీ అధికారులు ముందస్తు సన్నాహాకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్టేడియం సిబ్బంది మాట్లాడాడు.
'ప్రస్తుతం దేశంలో క్రికెట్కు ప్రేక్షకాదరణ భారీగా పెరిగింది. ఎక్కువ మంది చూస్తున్నారు. అలాగే యువత ఎక్కువగా క్రికెట్ను కెరీర్గా మల్చుకుంటోంది. వారందరినీ ప్రోత్సహించేందుకే ఈ ఏర్పాట్లు' అని అన్నారు. ఇదిలా ఉంటే సిరీస్లో నిలవాలంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్ కావడంతో టీమిండియా కొత్త వ్యూహాలకు మరింత పదును పెడుతోంది.