కివీస్తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఒక పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. అతను బౌలింగ్ ఎంచుకుంటాడా? లేక బ్యాటింగ్ తీసుకుంటాడా? అని జవగళ్ శ్రీనాధ్, కామెంటేటర్ రవిశాస్త్రి, కివీస్ సారధి టామ్ లాథమ్ అంతా చూస్తున్నారు. కానీ రోహిత్ మాత్రం తాము ఏం నిర్ణయించుకున్నారో మర్చిపోయి తికమక పడ్డాడు.
సాధారణంగా కాయిన్ టాస్ చేసిన తర్వాత అది తీసుకున్న వెంటనే గెలిచిన కెప్టెన్ తన నిర్ణయం చెప్పేస్తాడు. అయితే ముందుగా బౌలింగ్ చేద్దామా? లేక బ్యాటింగ్ తీసుకుందామా? అని టీం మీటింగ్లో చర్చించిన రోహిత్ శర్మ.. తాము ఏం నిర్ణయం తీసుకున్నారో మర్చిపోయాడు. దీంతో బుర్ర గోక్కుంటూ.. 'మేం ముందుగా..' అంటూ ఆలోచనలో పడిపోయాడు. అతని నిర్ణయం ఏంటో తెలియక జవగళ్ శ్రీనాధ్, టామ్ లాథమ్తోపాటు మైదానంలోని ప్రేక్షకులు, రోహిత్కు కొంత దూరంలో నిలబడి ఉన్న టీమిండియా సభ్యులు కూడా ఎదురు చూస్తుండిపోయారు.
చివరకు తాము ముందుగా బౌలింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు. ఈ సీన్ చూసిన నెటిజన్లు రోహిత్పై తెగ మీమ్స్ పేలుస్తున్నారు. 'వైవా రూంలో నేను కూడా అంతే.. ఏం గుర్తురాదు' అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఇంకొన్ని కామెడీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. 'టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని టీం మేనేజ్మెంట్ చెప్పి ఉంటే పరిస్థితి ఏంటి?' అని కొందరు సరదాగా ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా రోహిత్ తీసుకున్న నిర్ణయం భారత్కు కలిసొచ్చింది. బౌలర్లంతా అద్భుతంగా రాణించడంతో న్యూజిల్యాండ్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకోగా.. పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండ్ వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు.