కివీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టుకు శుభ్మన్ గిల్ (50), శిఖర్ ధవన్ (77) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే గిల్ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే ధవన్ కూడా అవుటవడంతో కొంత టెన్షన్ నెలకొంది.
ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ (80) రాణించినా.. అతనికి జత కలిసిన రిషభ్ పంత్ (15) మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ క్రమంలో అయ్యర్, సంజూ శాంసన్ (36) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయ్యర్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ఇద్దరూ కుదురుకున్నారు అనుకుంటున్న సమయంలో భారీ షాట్కు ప్రయత్నించిన సంజూ శాంసన్.. గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న అద్భుతమైన క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
శాంసన్ అవుటైన తర్వాత అయ్యర్కు జతకలిసిన వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్) తను కూడా బ్యాటరే అని మరసారి నిరూపించాడు. ఎడాపెడా భారీ షాట్లు ఆడేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత స్కోరు 300 దాటింది. ఇలాంటి సమయంలో చివరి ఓవర్లో అయ్యర్ కూడా అవుటయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ (1) కూడా పెవిలియన్ చేరడంతో.. టీమిండియా ఇన్నింగ్స్ 306/7 పరుగుల భారీ స్కోరు వద్ద ముగిసింది.
కివీస్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ ఇద్దరూ చెలరేగారు. వీళ్లిద్దరూ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ను ఫెర్గూసన్, ధవన్ను సౌథీ పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత ఫెర్గూసన్ ఒకే ఓవర్లో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివర ఓవర్లో టిమ్ సౌథీ అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ను అవుట్ చేశాడు.