
నేడు టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ బర్త్డే. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న చేతన్ శర్మ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా. చేతన్ 1983 నుంచి 1994 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చేతన్ భారత జట్టులో ఆల్రౌండర్గా రాణించాడు. ఈ కాలంలో చేతన్ 23 టెస్టు మ్యాచ్లు, 65 వన్డే మ్యాచ్లు ఆడాడు. అంతేకాకుండా ప్రపంచకప్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్గా చేతన్ రికార్డు సృష్టించాడు. 1987లో జరిగిన వరల్డ్ కప్లో న్యూజిలాండ్కు చెందిన కెన్ రూథర్ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఇవెన్ చాట్ఫీల్డ్లను వరుస బంతుల్లో ఔట్ చేయడం ద్వారా చేతన్ టోర్నమెంట్ చరిత్రలో ఈ రికార్డు సాధించాడు. అలాగే 1989లో నెహ్రూ కప్లో ఇంగ్లండ్ విసిరిన 256 పరుగుల లక్ష్య చేధనలో చేతన్ 96 బంతుల్లోనే సెంచరీ చేసి 101 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను గెలిపించాడు.
మొత్తంగా తన కెరీర్లో 23 టెస్టు మ్యాచ్లాడిన చేతన్ శర్మ 22 సగటుతో 396 పరుగులు చేశాడు. ఒక సారి మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ అందుకోని అత్యధికంగా 54 పరుగులు చేశాడు. బౌలింగ్లో 61 వికెట్లతో సత్తా చాటాడు. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీయగా.. మ్యాచ్లో 10 వికెట్లు తీశాడు. అలాగే 65 వన్డే మ్యాచ్లు ఆడి 24 సగటుతో 456 పరుగులు చేశాడు. ఒక్క సారి సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక బౌలర్గా 67 వికెట్లు తీశాడు. అత్యధికంగా ఓ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్ను 1984 అక్టోబర్ 17న పాకిస్థాన్తో ఆడాడు. ఇక చివరి మ్యాచ్ను 1989 ఏప్రిల్ 28న వెస్టిండీస్తో ఆడాడు. తొలి వన్డే మ్యాచ్ను 1983 డిసెంబర్ 7న వెస్టిండీస్తో ఆడాడు. తన చివరి మ్యాచ్ను కూడా వెస్టిండీస్తోనే 1994 నవంబర్ 11న ఆడాడు.
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక చేతన్ శర్మ కామెంటేటర్గా పని చేశాడు. అలాగే ఓ క్రికెట్ అకాడమీని కూడా నడిపాడు. 2020లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చేతన్శర్మ ఆ పదవిలోనే కొనసాగుతున్నాడు.