కివీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అద్భుతమైన రిటర్న్ క్యాచ్తో డారియల్ మిచెల్ను కూడా అవుట్ చేశాడు. చివర్లో మంచి భాగస్వామ్యం నిర్మిస్తున్న మైకేల్ బ్రేస్వెల్ను కూడా అవుట్ చేశాడు. తన సూపర్ స్పెల్తో న్యూజిల్యాండ్ను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ మ్యాచ్లో 6 ఓవర్లు వేసిన షమీ ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేసిన అతను కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం యువపేసర్ ఉమ్రాన్ మాలిక్తో కలిసి తన ఆటతీరుపై మాట్లాడాడీ వెటరన్ పేసర్. తానేం కొత్తగా చేయలేదని, వికెట్ కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తోందని కొందరు అంటున్నారని, కానీ తనకేం అలా అనిపించలేదని షమీ తేల్చిచెప్పాడు. తాను ఎప్పుడూ బౌలింగ్ చేసేలాగే బౌలింగ్ చేశానని చెప్పాడు.
'నా నైపుణ్యంపై నమ్మకం పెట్టుకున్నా. నా లైన్ అండ్ లెంగ్త్ చక్కగా మెయింటైన్ చేశాను. కొత్తగా ఏం ప్రయోగాలు చేయాలని అనుకోలేదు. నేను ఎప్పుడు బౌలింగ్ చేసినా అంతే. ఈ మ్యాచ్లో కూడా అదే చేశా. అయితే ఈ పిచ్లో కొంత తేమ కనిపించింది. అదే మాకు అనుకూలంగా పనిచేసింది. ఈ తేమ వల్లనే మరింత బలంగా బంతులు పిచ్ వేశాం. అలా చేస్తే బంతి సీమ్ అవుతుందని అనుకున్నాం. అందుకే నేను సాధ్యమైనంత బలంగా పిచ్ చేయడానికి ప్రయత్నించా' అని వివరించాడు. షమీ ఒక్కడే కాదు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ తదితరులంతా చక్కగా బౌలింగ్ చేయడంతో కివీస్ జట్టు ఈ మ్యాచ్లో 108 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.