
బిజీబిజీగా..
ఈ క్రమంలో- భారత జట్టు కూడా విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. తొలుత- స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. జూన్లో దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనకు రానుంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇది. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.

ఐర్లాండ్.. ఇంగ్లాండ్
17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ల పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. అనంతరం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖరారు చేసింది. వెస్టిండీస్తో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, అయిదు టీ20 మ్యాచ్లను ఆడుతుంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.

వెస్టిండీస్ టూర్ ఫిక్స్..
అయిదు టీ20ల్లో చివరి రెండింటినీ అమెరికాలో నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించింది బీసీసీఐ. అక్కడ క్రికెట్ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జులై 22వ తేదీన ఆరంభమౌతుంది. 22, 24, 27 తేదీల్లో ఈ మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఉంటాయి. ట్రినిడాడ్లోని క్వీన్ పార్క్ ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్లకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అదేనెల 29వ తేదీన సెయింట్ కీట్స్లోని బ్రియాన్ ఛార్లెస్ లారా స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ను ఆడతాయి ఈ రెండు జట్లు.

రెండుగా విభజన..
ఆగస్టు 1, 2 తేదీల్లో నెవిస్లోని వార్నర్ పార్క్లో బ్యాక్ అండ్ బ్యాక్ టీ20ల్లో తలపడతాయి. ఈ మూడు మ్యాచ్ల అనంతరం భారత్, వెస్టిండీస్ జట్లు అమెరికాకు బయలుదేరి వెళ్తాయి. ఆగస్టు 6,7 తేదీల్లో ఫ్లోరిడాలో చివరి రెండు టీ20లను ఆడతాయి. ఆయా సిరీస్లను ఆడటానికి టీమిండియాను రెండుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టుల కోసం టీమ్..
టెస్ట్ ఫార్మట్ కోసం ప్రత్యేకంగా సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్టును ఇంగ్లాండ్ పర్యటనకు పంపిస్తుందని సమాచారం. అలాగే వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మట్ స్పెషలిస్టులతో మరో టీమ్ను వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. ఇదివరకు ఈ ప్రయోగం చేసింది బీసీసీఐ. ఇంగ్లాండ్లో సీనియర్ టీమ్ టెస్ట్ మ్యాచ్లను ఆడుతున్న సమయంలో జూనియర్లతో రూపొందించిన జట్టును శ్రీలంకకు పంపించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












