బంగ్లాదేశ్పై భారత అమ్మాయిలు పగ తీర్చుకున్నారు. మూడు వన్డేల సిరీస్ను ఘోరమైన ఓటమితో ప్రారంభించిన ఇండియా.. రెండో వన్డేలో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టును జెమీమా రోడ్రిగెజ్ ఒంటి చేత్తో గెలిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. జెమీమా అద్భుతమైన ఆటతీరుతో 86 పరుగులు చేసింది.
ఆమెతోపాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (52) కూడా రాణించింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది.దీంతో భారత జట్టు ఏకంగా 108 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఛేజింగ్లో బంగ్లాదేశ్ను భారత బౌలర్ దేవిక వైద్య బాగా దెబ్బకొట్టింది. ఇక చివర్లో లోయర్ ఆర్డర్ను జెమీమా తుత్తునియలు చేసింది. ఆమె ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్లో ఒకానొక దశలో బంగ్లాదేశ్ 106/3తో పటిష్టమైన స్థితిలో కనిపించింది. కానీ భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఆ టీంకు ఓటమి తప్పలేదు. ఈ టీం చివరి ఏడు వికెట్లను కేవలం 14 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్ జట్టు 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు.
బంగ్లా బ్యాటర్లలో ఫర్గానా హక్ (47), రీతూ మోని (27), ముర్షీదా ఖాతున్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా ఎవరూ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫర్గానా, రీతూ ఇద్దరూ కీలకమైన 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే బంగ్లాదేశ్ గెలిచేలా కనిపించింది. అయితే వైద్య తన సూపర్ బౌలింగ్తో ఈ జోడీని విడగొట్టింది.

ఆమె బౌలింగ్లో టర్న్, బౌన్స్కు తడబడిన ఫర్గానా స్టంపౌట్గా వెనుతిరిగింది. రోడ్రిగెజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రీతూ కూడా స్టంపౌట్ అవడంతో బంగ్లాదేశ్ ఆశలు ఆవిరయ్యాయి. అటు బ్యాటుతో, ఇటు బంతితో చెలరేగిన జెమీమాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.