భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీసులో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. ఇక్కడ భారత జట్టుకు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం లభించింది. రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్య తదితరులను ఇలా ఆహ్వానిస్తున్న వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 కోసం అహ్మదాబాద్ చేరుకున్నాం అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
ఈ సిరీసులో తొలి మ్యాచులో టీమిండియా ఓటమిపాలైంది. భారత బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆ మ్యాచులో భారత్ ఓడింది. ఇక రెండో మ్యాచులో స్పిన్నర్లు రాజ్యమేలారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు కూడా తడబడింది. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో మరోసారి సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీసు 1-1 తో సమం అయింది. మూడో మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచిన వారికే సిరీస్ దక్కుతుంది. ఈ మ్యాచ్ ఓడితే హార్దిక్ కెప్టెన్సీలో ఓడిన తొలి సిరీస్ ఇదే అవుతుంది. అలాగే నంబర్ వన్ టీ20 జట్టుగా భారత్ ర్యాంకు కూడా పడిపోయే ప్రమాదం ఉంది.
Hello Ahmedabad 👋
— BCCI (@BCCI) January 30, 2023
We are here for the third & final T20I of the #INDvNZ series 👏 👏#TeamIndia pic.twitter.com/gQ1jPEnPvK
అయితే తొలి రెండు మ్యాచుల్లా కాకుండా ఈ మూడో టీ 20లో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీమిండియా కూడా జట్టులో కొన్ని మార్పులు చేయాలని, పృథ్వీ షా ను ఆడించాలని సలహాలు ఇస్తున్నారు. కానీ టీమ్ మేనేజిమెంట్ మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆలోచించడం లేదని సమాచారం. మూడో మ్యాచులో కూడా గిల్, ఇషాన్ కిషన్ ను ఆడించాలని హార్దిక్ అనుకుంటున్నాడు. మరి ఈ మ్యాచులో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక స్పిన్నర్ నుంపక్కన పెట్టి మరో బ్యాటర్ ను బరిలో దింపుతాడేమో చూడాలి.