
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్లో చివరిదైన మూడో టీ20 కోసం భారత క్రికెట్ జట్టు పూణెకి చేరుకుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య శుక్రవారం జరిగే చివరి టీ20కి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు పూణెకి చేరుకున్నాయి.
కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా జట్టు సభ్యులందరూ ప్రత్యేక విమానంలో పూణెకు వచ్చారు. భారత ఆటగాళ్లకు ఇక్కడి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. గువహటి వేదికగా జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో చివరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. సిరీస్ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాలి.
దీంతో మూడో టీ20లో గెలిచి సిరిస్ను సమం చేయాలని గట్టి పట్టుదలతో శ్రీలంక ఉంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను సమంతో ముగిస్తుందా లేదా చూడాలి మరి. ఈ సిరిస్లో ఇప్పటికే ఒక మ్యాచ్లో కోహ్లీసేన నెగ్గడంతో ఆఖరి టీ20లో పలు మార్పులు చేసే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్కప్లో శిఖర్ ధావన్ చోటు దక్కించుకోవాలంటే తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషబ్ పంత్లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇండోర్లో నాలుగోస్థానంలో ఆడినా పుణేలో మాత్రం కోహ్లీ తన పాత స్థానానికి వచ్చే అవకాశముంది.
మిడిలార్డర్లో తనకు దక్కిన అవకాశాలను శ్రేయాస్ అయ్యర్ చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఇదే ఫామ్ని అతడు గనుక కొనసాగిస్తే భారత్కు చాలా కాలంగా సమస్యగా మారిన NO.4 స్పాట్కు ఓ పరిష్కారం లభించినట్లే. శివమ్ దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బంతితో మాత్రం ఫరవాలేదనిపిస్తున్నాడు.
వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో స్పెషలిస్ట్ బౌలర్గా నిలుస్తున్నాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో యజువేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. రొటేషన్ పాలసీలో భాగంగా చాహల్ను ఆడించవచ్చు. ఇండోర్లో వేదికగా జరిగిన రెండో టీ20లో కుల్దీప్ రెండు వికెట్లు తీసి రాణించాడు.
అయితే, గత ఐదు మ్యాచ్ల్లో రిజర్వ్కే పరిమితమైన చాహల్ను ఆడించే అవకాశాలున్నాయి. గత రెండు మ్యాచ్ల్లో మాదిరిగానే భారత తుదిజట్టులో ముగ్గురు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ ఆడనున్నారు. రెండో టీ20లో కీలక సమయంలో రెండు వికెట్లు తీసి సైనీ టీమిండియాకు బ్రేకిచ్చాడు.
గాయం నుంచి కోలుకుని లంకతో సిరిస్లో రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి ఓవర్ను రెండు వైడ్లతో స్టార్ట్ చేసిన బుమ్రా ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు ఇచ్చాడు. బుమ్రా ట్రాక్లో పడితే టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారినట్లే. మ్యాచ్ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది.
భారత తుది జట్టు (అంచనా):
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా.