
ఇండోర్: భారత ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక డే/నైట్ టెస్టు కోసం ఆదివారం ఫ్లడ్లైట్ల వెలుతురులో భారత ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో.. డే/నైట్ టెస్టుకు ముందు రెండు రోజుల అదనపు సమయం లభించడంతో ఆటగాళ్లు గులాబి బంతితో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
బంగ్లా క్రికెటర్లు సైతం ఇండోర్ మైదానంలోనే ప్రాక్టీస్ చేయనున్నారు. గులాబి టెస్టు కోసం రెండు జట్లు వచ్చే మంగళవారం ఈడెన్ గార్డెన్స్కు చేరుకోనున్నాయి. తొలిసారి డే నైట్ టెస్టు ఆడబోతున్న నేపథ్యంలో ఇరు జట్లు పరిస్థితులకు అలవాటు పడేందుకు గులాబీ బంతితో ఫ్లడ్లైట్ల వెలుతురులో ప్రాక్టీస్ ఆరంభించాయి. ప్రాక్టీస్ సమయంలో పింక్ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంపై క్రికెటర్లు అందరూ దృష్టి పెడుతున్నారు.
హోల్కర్ స్టేడియంలో కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత శిక్షణ జరుగుతోంది. ఆటగాళ్లు గులాబి బంతిని ఎలా ఎదుర్కొంటున్నారా అని రవిశాస్త్రి పరిశిలీస్తున్నాడు. పక్కనే ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కూడా ఉన్నాడు. ప్రాక్టీస్ సంబందించిన ఓ ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. 'ఇది పింక్ సమయం. కోల్కతా టెస్ట్ కోసం ఇండోర్లో ఫ్లడ్లైట్ల కింద ప్రిపరేషన్' అని ట్వీట్ చేసింది. మరోవైపు ఓ అభిమాని ఆటగాళ్ల ప్రాక్టీస్ చేసే వీడియో షేర్ చేసాడు. ఆదివారం, సోమవారం రెండు రోజులు ఆదనపు ప్రాక్టీస్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు ఇండోర్లోనే ఉన్నారు.
రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబి బంతితో ప్రాక్టీస్ చేశారు. రిజర్వు బ్యాట్స్మెన్ హనుమ విహారి, శుభ్మన్ గిల్ సైతం సాధన చేయడం గమనార్హం. రోహిత్ శర్మ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు. ఇరు జట్లలో చాలా మంది సభ్యులకు పింక్ బంతి కదలికలపై పెద్దగా అవగాహన లేదు. కూకాబుర్ర గులాబి బంతులతో దులీప్ ట్రోఫీలో ఆడిన అనుభవం మాత్రం కుల్దీప్కు ఉంది.