
గంభీరమైన వాతావరణం:
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో గంభీరమైన వాతావరణం ఉండేది. ఎంకే పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, మొహ్మద్ హాజారుద్దిన్ హయాంలో భారత డ్రెస్సింగ్ రూమ్ గంభీరంగా ఉండేది. సీనియర్లకు జూనియర్లు భయపడేవారు. కొందరు ఎంతో గౌరవం ఇచ్చేవారు. కొత్త శతాబ్దంలో యువకుల రాకతో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ల ముందు నోరు విప్పాలంటే కొత్త ఆటగాళ్ల కొంచెం భయపడేవారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రాకతో డ్రెస్సింగ్ రూమ్లో సందడి షూరూ అయినా.. అదీ ప్రొఫెషనల్గానే ఉండేది. వీరందరూ సీనియర్లకు గౌరవమిస్తూనే.. సరదాగా ఉండేవారు. ఇక ఎంఎస్ ధోనీ హయాంలో పూర్తిగా మారిపోయింది. సీనియర్, జూనియర్లు కలిసిపోయారు.

ఒకప్పటి కంటే పూర్తి భిన్నం:
ప్రస్తుత భారత డ్రెస్సింగ్ రూమ్ ఒకప్పటి కంటే పూర్తి భిన్నంగా ఉంది. సీనియర్, జూనియర్ అనే తేడాలు పక్కనపెట్టి.. ఆటగాళ్లంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం అంతా కలిసి జాలీగా గడుపుతున్నారు. మరుపురాని క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ హల్చల్ చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఈ స్థాయి అనుబంధాల వెనుక కరోనా మహమ్మారి కూడా ఉంది. వైరస్ కారణంగా క్వారంటైన్లు, బయోబబుల్లు ఆటలో భాగమై పోవడంతో ఆటగాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలెట్టారు. గతంలో చాలా తక్కువ సమయం మాత్రమే కలిసుండే ఆటగాళ్లు.. ఇప్పుడు రోజుల తరబడి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జట్టుతోనే ఉంటున్నారు. బబుల్ పుణ్యమాని ప్లేయర్స్ అందరూ ఓ జట్టులా కాకుండా ఓ కుటుంబంలా మెలుగుతున్నారు. ఆటగాళ్ల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో మైదానంలోనూ మంచి ఫలితాలు వస్తున్నాయి.

ముందు తిట్లు నేర్చుకుని:
2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు, తమిళనాడు ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్కు తొలి నాళ్లలో హిందీ వచ్చేది కాదు. దీంతో ఆరంభంలో అతడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ సాయంతో ముందు తిట్లు నేర్చుకున్నాడు. ఇప్పుడు హిందీలోనే ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి యాష్ ఎదిగాడు. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన యువ పేసర్ తంగరసు నటరాజన్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. అయితే మిగిలిన జట్టు సభ్యులు అతడిని ఒంటరి చేయకుండా వారి వంతు సాయం చేస్తూ అతడిని ప్రోత్సహించారు. దీంతోనే ఆస్ట్రేలియాలో అద్భుత ఫలితాలు వచ్చాయి. అందరికంటే సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చతేశ్వర పుజారాను జట్టు సభ్యులంతా ఆట పట్టించడంలోనూ అంతులేని ప్రేమ దాగుంది. 2019లో ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం అనంతరం జట్టు అంతా కలిసి మైదానంలో పుజారా డాన్స్ అంటూ చేతులు, కాళ్లు ఊపారు. ఇలా మైదానం లోపలా, బయటా అంతా కలిసి కట్టుగా ఉండటం.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల గ్రౌండ్లో మనవాళ్ల ప్రదర్శన కూడా మెరుగైంది.

ఇంటర్వ్యూలతో హల్చల్:
భారత ఆటగాళ్లలో వచ్చిన ఈ నయా మార్పులకు టెక్నాలజీ కూడా ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. గతేడాది లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో క్రికెటర్లు సందడి చేసిన విషయం తెలిసిందే. ఇంటర్వ్యూలు, ఇన్స్టాగ్రామ్లో చిట్ చాట్లు, ఫేస్బుక్ లైవ్లు ఇలా మనోళ్లు అభిమానులను అలరించారు. ఇంటర్వ్యూలలో తోటి ఆటగాళ్లను ఓ ఆదుకున్నారు కూడా. జూమ్ మీటింగ్ల ద్వారా ఒకతోమకరు టచ్లోనే ఉన్నారు. దీంతో జట్టు సభ్యుల మధ్య బంధం బలమైంది. ఆ తర్వాత ఎలాంటి టోర్నీకి వెళ్లిన క్వారంటైన్ తప్పనిసరి కావడంతో.. ఆటగాళ్ల మధ్య అనుబంధాలు పెరిగాయి. గతంలో ఒకే ప్రాంతం నుంచి వచ్చిన ఆటగాళ్ల మధ్య ఎక్కువ సఖ్యత కనిపించేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా మనవాళ్లు జట్టుగా ముందుకు సాగుతున్నారు. దీనికి మహమ్మారి కూడా ఓ కారణమనే చెప్పాలి.

సిరాజ్తో పంత్ దోస్తీ:
ఒకప్పుడు జట్టు బస్సులో సీనియర్ ఆటగాళ్లకు నిర్దేశిత స్థానాలు ఉండేవి. కొత్తగా జట్టులోకి వచ్చినవాళ్లు వెనుక సీట్లకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా కూర్చుంటున్నారు. ఎవరు ఎవరితోనైనా మాట్లాడుతూన్నారు. లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బ్యాట్తో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకొని పెవిలియన్కు వస్తున్న సమయంలో భారత ఆటగాళ్లంతా వరుసగా నిల్చొని వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక హిమాచల్కు చెందిన రిషబ్ పంత్.. హైదరాబాదీ మొహ్మద్ సిరాజ్తో దోస్తీ చేస్తుంటే! ముంబైకి చెందిన రోహిత్ శర్మ.. తమిళ తంబి ఆర్ అశ్విన్తో సన్నిహితంగా ఉంటున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన పనేలేదు. జూనియర్ పృథ్వీ షా నుంచి.. సీనియర్ ఇషాంత్ వరకు ఇట్టే కలిసిపోతాడు. దీనంతటి కారణం వైరస్ అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications












