
హైదరాబాద్: కోహ్లీ సేనకు త్వరలోనే మరో శుభవార్త చేరనుంది. మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్లకు జాక్పాట్ దక్కనుంది. మరి కొద్ది నెలల్లో ఆటగాళ్లతో బీసీసీఐ చేసుకున్న ఒప్పందం గడువు ముగియడంతో సరికొత్త నిర్ణయాలకు తెరలేపింది. ఇందులో జీతాలు పెంచేందుకు బీసీసీఐ ఆటగాళ్లను A+, A, B, Cగా విభజించింది. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లు A+లో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.
ఇలా చేస్తే కోహ్లీ, ధావన్, రోహిత్, పాండ్య, భువనేశ్వర్ తదితర ఆటగాళ్లు భారీగానే వేతనాలు అందుకుంటారు. మార్చి 3న ముక్కోణపు సిరీస్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు శ్రీలంకకు బయలుదేరనున్నారు. ఆటగాళ్లు ఈ పర్యటనకు బయలుదేరే ముందే బీసీసీఐ ఈ శుభవార్త ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
A, B, C విభాగాల వారీగా రూ.2 కోట్లు, రూ. 1కోటి. రూ.50 లక్షలుగా వేతనాలు నిర్ధేశించినట్లు సమాచారం.
మంగళవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కోహ్లీతో పాటు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నట్లు సమాచారం. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గతంలో అగ్ర జాబితాలో ఉండటంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏ ఆటగాళ్లు ఏ జాబితాలో చోటు దక్కించుకుని ఎంత మేర వేతనాలు అందుకుంటారో తెలియాలంటే బీసీసీఐ ప్రకటించే వరకు వేచి ఉండక తప్పదు. గత ఏడాది కోహ్లీ, ధోనీ, రవిశాస్త్రి ఆటగాళ్ల జీతాలు పెంచాలని బీసీసీఐతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
వీరికి మాత్రం కోత తప్పదు:
సెలక్టరు నియామక అధికారి అయిన ఎమ్మెస్కే ప్రసాద్ ఈ బాధ్యతలను త్వరగా పూర్తి చేయాలంటూ సిబ్బందిని ఆదేశించారు. మరి కొద్ది రోజుల్లో ఆటగాళ్లు కొత్త సిరీస్లలో పాల్గొననున్న నేపథ్యంలో మరింత త్వరగా వేతనాలను నిర్దేశించనున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛతేశ్వర్ పూజారాలు వన్డే, టీ20ల్లో ఆడట్లేదన్న విషయం తెలిసిందే.