పొట్టి ఫార్మాట్లో..
ఈ ఏడాది భారత జట్టు ఎక్కువగా టీ20 మ్యాచులే ఆడింది. టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఫార్మాట్పై టీమ్ మేనేజ్మెంట్ బాగా ఫోకస్ పెట్టింది. ఆసియా కప్ కూడా ఈ ఫార్మాట్లోనే నిర్వహించారు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో బెస్ట్ బ్యాటర్ రేసులో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. మొత్తం ఆరుగురు నామినీల్లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి సూర్యకుమార్ టాప్ గేరులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్గా సూర్య ఉన్నాడు. అతనితోపాటు పాకిస్తాన్ నుంచి మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, కివీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్, జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
వన్డేల్లోనూ మనవాళ్లు ఇద్దరు
భారత జట్టు వన్డే ఫార్మాట్లో కూడా ఈ ఏడాది మంచి ప్రదర్శనే చేసింది. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అత్యుత్తమ ఫామ్ కనబరిచారు. ఈ నేపథ్యంలోనే గిల్ తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీ కూడా నమోదు చేశాడు. ఇప్పుడు 2022 సంవత్సరానికిగానూ బెస్ట్ వన్డే బ్యాటర్ అవార్డు రేసులో కూడా గిల్ నిలిచాడు. అతనితోపాటు భారత్ నుంచి శ్రేయాస్ అయ్యర్ కూడా పోటీలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, నమీబియా బ్యాటర్ గెరార్డ్ ఎరాస్మస్, సికందర్ రజా, ఆసీస్ వెటరన్ ట్రావిస్ హెడ్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
టెస్టుల్లో ఒకే ఒక్కడు..
ఈ ఏడాదిలో భారత జట్టు పెద్దగా టెస్టులు ఆడలేదు. ఇంగ్లండ్తో ఆడిన ఒక టెస్టులో ఓటమిపాలైంది. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలో కూడా సిరీస్ ఓడింది. శ్రీలంక, బంగ్లాదేశ్పై టెస్టు సిరీసులను క్లీన్ స్వీప్ చేసింది. అయితే దాదాపు ఈ మ్యాచులు అన్నింటిలోనూ భారత్ తరఫున రాణించిన ఆటగాళ్లలో రిషభ్ పంత్ ఒకడు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టుల్లో కూడా పంత్ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే బెస్ట్ టెస్టు బ్యాటర్ రేసులో భారత్ నుంచి అతను ఒక్కడే పోటీ పడుతున్నాడు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, జానీ బెయిర్స్టో, ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.