సౌతాఫ్రికాలో జరిగిన సెంచూరియన్ టెస్టు మ్యాచ్లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బందితో కలిసి టీమిండియా ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారత ఆటగాళ్లు మ్యాచ్ ముగించుకోని హోటల్కు వచ్చారు. ఈ క్రమంలో వారు బస్సు దిగగానే హోటల్ సిబ్బంది సంగీతానికి డ్యాన్స్ చేస్తూ స్వాగతం పలికారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా వారితో కలిసి డ్యాన్స్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా వైస్ కెప్టెన్ లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, రవిచంద్రన అశ్విన్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ తదితర ఆటగాళ్లంతా హోటల్ సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేస్తూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, చటేశ్వర్ పుజారా కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు, హోటల్ సిబ్బందితో కలిసి డ్యాన్య్ చేస్తున్నారు. హోటల్ సిబ్బంది చప్పట్లు కొడుతూ, డ్యాన్స్ చేస్తూ, టీమిండియా ఆటగాళ్లను మరింత ఉత్సాహపరుస్తున్నారు. పక్కన మరో ఇద్దరు వ్యక్తులు భారత జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా ఈ వీడియోలో హోటల్ సిబ్బంది అంతా మాస్కులు ధరించి సెలబ్రేషన్స్లో పాల్గొనడం గమనార్హం. మ్యచ్ అనంతరం ఎప్పుడూ నిర్వహించే ప్రెస్ మీట్లు బోర్ కొడతాయని, ఇలా పుజారా, సిరాజ్తో, హోటల్ సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం బాగుందని అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇది గొప్ప విజయం అని, ఈ సెలబ్రేషన్ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని అశ్విన్ తెలిపాడు.
కాగా సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ను 113 పరుగుల తేడాతో కైవసం చేసుకోని 3 టెస్టుల సిరీస్లో 1-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా సెంచూరియన్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లో 40వ విజయాన్ని నమోదు చేశాడు. అంతేకాకుండా సౌతాఫ్రికాలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ విజయాలు సాధించిన భారత కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ధోని పేరు మీద ఉండేది. ధోని ఇప్పటివరకు సౌతాఫ్రికలో 16 విజయాలు సాధించగా.. తాజాగా కోహ్లీ 17 విజయాలతో దానిని బ్రేక్ చేశాడు. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్గా కూడా కోహ్లీ నిలిచాడు.