
బలహీనమైన టీమిండియా..
బుమ్రా, జడేజా వంటి ఆటగాళ్లు లేకపోవడంతో భారత బౌలింగ్ యూనిట్ బలహీనంగా కనిపిస్తోంది. దానికితోడు నిఖార్సయిన స్పిన్నర్ను కూడా బంగ్లా పర్యటనకు ఎంపిక చేయలేదు. మూడో వన్డేకు చివరి నిమిషంలో కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసినా అతను ఆడేదీ లేనిదీ చెప్పడం కష్టం. అలాగే మొదటి రెండు వన్డేల్లో రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా గాయాలపాలయ్యారు.
దీంతో భారత జట్టు పూర్తి బలంతో మూడో వన్డే బరిలో దిగడం అసాధ్యంగా కనిపిస్తోంది. అలాగే రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న కేఎల్ రాహుల్పై ఈ ఒత్తిడి మరింత ప్రభావం చూపుతుంది. ఇంత ఒత్తిడిని కెప్టెన్గా అనుభవం లేని రాహుల్ తట్టుకోలేడని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో రాహుల్ కెప్టెన్సీ చేయగా.. ఆ సిరీస్ను భారత్ 3-0తో కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఒత్తిడిలో టీమిండియా..
పసికూన బంగ్లాతో బడా జట్టయిన టీమిండియా ఆడుతుందంటే.. ఎవరైనా సరే సిరీస్లో భారతే ఫేవరెట్ అంటారు. దానికితోడు టీమిండియా బెంచ్ బలం కూడా చాలా ఎక్కువ. దీంతో భారత్ బీ టీం వెళ్లినా బంగ్లాపై గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ స్టార్లతో కూడిన టీమిండియా.. అనూహ్యంగా తొలి రెండు మ్యాచుల్లో ఓడింది.
తొలి వన్డేలో 131 పరుగులకే 9 వికెట్లు తీసుకున్న టీమిండియా.. 50 పరుగుల వ్యవధిలో మరో వికెట్ తీయలేక చతికిల పడింది. అలాగే రెండో వన్డేలో 69/6 స్కోరుతో ఉన్న బంగ్లాదేశ్ను కట్టడి చేయలేక 271 పరుగుల భారీ స్కోరు చేసే అవకాశం కల్పించింది. ఇలా కీలకమైన సమయంలో మ్యాచ్పై పట్టు కోల్పోవడం జట్టుపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. ఇప్పుడు కీలకమైన ఆటగాళ్లు కూడా లేకపోవడంతో అది రెట్టింపు అవుతుంది.

స్వదేశంలో బంగ్లా పులులే..
టెస్టులు, టీ20ల్లో బంగ్లాదేశ్ బలహీన జట్టే. కానీ వన్డేల్లో ఆ టీం రూటే సపరేటు. అది కూడా స్వదేశంలో సిరీస్ అంటే బంగ్లా మరింత బలంగా మారుతుంది. స్వదేశంలో బంగ్లాదేశ్ ఆడిన చివరి 14 వన్డేల్లో కేవలం ఒక్కదాంట్లోనే ఆ జట్టు ఓడిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ చివరగా స్వదేశంలో వన్డే సిరీస్ ఓడింది 2016లో ఇంగ్లండ్ చేతిలో.
ఆ తర్వాత మళ్లీ వన్డే సిరీస్ ఓడలేదు. భారత్తో జరిగిన రెండు వన్డేల్లో కూడా ఒత్తిడికి ఎదురొడ్డి ఆ జట్టు విజయం సాధించింది. గతంలో ఒత్తిడి గురై ఓడిపోయే ఆ జట్టు గెలవడంపై రెండు మ్యాచుల్లోనూ బంగ్లా హీరో మెహదీ హసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.
అతను మాట్లాడుతూ.. 'భారత్తో ఎప్పుడు ఆడినా మ్యాచులు చాలా ఉత్కంఠగా ఉంటాయి. కానీ చివరకు మేం ఓడిపోయే వాళ్లం. ఇప్పుడు గెలవడంతో ఏదో పెద్ద అడ్డంకిని దాటేసినట్లుంది' అని హసన్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












