భారత అమ్మాయిలు చిత్తుగా ఓడారు. బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో భారత మహిళల జట్టు దారుణంగా ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మహిళలను భారత బౌలర్లు కట్టడి చేశారు. మీర్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా 40 పరుగుల తేడాతో బంగ్లా మహిళలు ఘనవిజయం సాధించారు. వన్డేల్లో భారత్పై బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ టీం కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అమన్జోత్ కౌర్ నాలుగు వికెట్లతో రాణించింది. దీంతో వర్షం వల్ల 44 ఓవర్లకు కుదించిన ఈ గేమ్ను భారత మహిళల జట్టు ఈజీగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బంగ్లా బౌలర్లలో మరుఫ అక్తర్ నాలుగు వికెట్లు, రబేయా ఖాన్ మూడు వికెట్లతో చెలరేగారు. దీంతో టీమిండియా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

స్మృతి మంధాన (11), ప్రియా పూనియా (10), హర్మన్ప్రీత్ కౌర్ (5), యాస్తికా భాటియా (15), జెమీమా రోడ్రిగెజ్ (10) ఎవరూ రాణించలేదు. 20 పరుగులు చేసిన దీప్తి శర్మ ఈ టీంలో టాప్ స్కోరర్ అంటేనే వీళ్ల బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పొచ్చు. ఈ క్రమంలోనే భారత అమ్మాయిలు 35.5 ఓవర్లలో కేవలం 113 పరుగులే చేసి ఆలౌట్ అయ్యారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో బంగ్లా 1-0 ఆధిక్యం సాధించింది.
ఈ ఓటమిని భారత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్లో లహీనమైన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్ చేతిలో ఇంత దారుణంగా ఓడిపోవడంపై మండిపడుతున్నారు. భారత అమ్మాయిలను 'చోకర్స్..' అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం పోరాడలేదంటూ స్టార్ ప్లేయర్లను తిట్టిపోస్తున్నారు. మరి తర్వాతి మ్యాచులో అయినా భారత మహిళలు పుంజుకుంటారేమో చూడాలి.