
ఆసీస్ భారీ స్కోరు
వీళ్లు అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ (49 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచింది. ఆమెకు ఆష్లీ గార్డనర్ (31) ధనాధన్ ఇన్నింగ్స్ కూడా తోడవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. వీళ్లిద్దరూ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు చివరి పది ఓవర్లలో 103 పరుగులు చేసింది.
వీటిలో చివరి ఐదు ఓవరల్లోనే 61 పరుగులు వచ్చాయి. మరీ దారుణంగా చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 30 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

టాపార్డర్ అట్టర్ఫ్లాప్..
లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం దక్కలేదు. ఫామ్ లేక సతమతం అవుతున్న షెఫాలీ వర్మ (9) మరోసారి విఫలమైంది. స్మృతి మంధాన (2), యాస్తికా భాటియా (4) కూడా రాణించలేదు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (52), జెమీమా రోడ్రిగెజ్ (43) ఇద్దరూ కాపాడారు. అద్భుతంగా పోరాడిన వీళ్లు క్రీజులో ఉన్నంత సేపూ భారత్ గెలిచేలా కనిపించింది. ఆ తర్వాత షార్ట్ బాల్ను ఆడే క్రమంలో రోడ్రిగెజ్ అవుటైంది. అప్పటికీ హర్మన్ క్రీజులో ఉండటంతో ఆశలు చావలేదు.

ఒక్క రనౌట్ అంతా మార్చేసింది..
హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత దురదృష్టవశాత్తూ హర్మన్ప్రీత్ కౌర్ కూడా అవుటైంది. బౌండరీ వద్దకు బంతి వెళ్లడంతో సులభంగా రెండు పరుగులు వస్తాయని హర్మన్ అనుకుంది. వచ్చాయి కూడా. కానీ క్రీజులోకి వచ్చే ముందు బ్యాటును నేలపై పెట్టినప్పుడు ఆమె బ్యాట్ ముందుకు కదల్లేదు. అక్కడే నేలలో దిగబడింది. దీంతో ఆమె పరుగు పూర్తి చేయడం ఆలస్యమైంది. దీన్ని గమనించి ఆసీస్ వికెట్ కీపర్ అలీసా హేలీ ఆమెను రనౌట్ చేసేసింది. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
పేకమేడలా కూలిన లోయర్ ఆర్డర్..
హర్మన్ అవుటైన తర్వాత వచ్చిన రిచా ఘోష్ (14), దీప్తి శర్మ (20 నాటౌట్), స్నేహ్ రాణా (11), రాధా యాదవ్ (0), శిఖా పాండే (1 నాటౌట్) పరగులు మాత్రమే చేయగలిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్, డ్రాసీ బ్రౌన్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. మేగన్ షూట్, జెస్ జోనాస్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications












