
న్యూజిల్యాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ (36) వర్షం అంతరాయం తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన భారత జట్టుకు శుభారంభం అందించేందుకు ప్రతయ్నించిన ఇషాన్ కిషన్ రాణించాడు. ఒక పక్క రిషభ్ పంత్ (13 బంతుల్లో 6) జిడ్డు ఆట ఆడినా.. ఇషాన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ ఆకట్టుకున్నాడు.
అతను మంచి టచ్లో కనిపిస్తుండగా వర్షం పడింది. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఆట మొదలైన తర్వాత ఐష్ సోధి బౌలింగ్లో ఇషాన్ను ఎల్బీడబ్ల్యూగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే అతను రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకడం లేదని తేలడంతో బతికిపోయాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.
ఆఫ్స్టంప్ ఆవలగా పడిన బంతిని కట్ చేసేందు కిషన్ ప్రయత్నించాడు. అయితే టైమింగ్ సరిగా కుదరలేదు. ఆ షాట్లో సరైన బలం కూడా కనిపించలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతిని షార్ట్ థర్డ్లో ఉన్న టిమ్ సౌథీ చక్కగా అందుకున్నాడు. తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను చటుక్కున పట్టేయడంతో కిషన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
దీంతో భారత జట్టు 69 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (24 నాటౌట్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. దీంతో టీమిండియా 11 ఓవర్లలో 82/2 స్కోరుతో నిలిచింది. అంతకుముందు రిషభ్ పంత్ కూడా ఆఫ్స్టంప్ ఆవలగా పడిన బంతినే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కూడా షార్ట్ థర్డ్లో ఉన్న సౌథీ పరిగెడుతూనే డీప్ థర్డ్లో అద్భుతమైన క్యాచ్ అందుకొని పంత్ను అవుట్ చేశాడు.