న్యూజిల్యాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా వచ్చిన రిషభ్ పంత్ (6) మరోసారి నిరాశపరిచాడు. బౌండరీతో తొలి నాలుగు పరుగులు చేసిన పంత్.. ఆ తర్వాత పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఒక ఎండ్లో ఇషాన్ కిషన్ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క పంత్ కనీసం బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
ఈ క్రమంలో తొలి పవర్ప్లే చివరి ఓవర్ తొలి బంతికి పంత్ పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా పడిన షార్ట్ బాల్ను బలంగా బాదేందుకు పంత్ ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి లేచిన బంతిని టిమ్ సౌథీ అద్భుతంగా అందుకున్నాడు. షార్ట్ థర్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న అతను డీప్ థర్డ్ వరకు పరిగెత్తుకెళ్లి క్యాచ్ పట్టేశాడు. దీంతో 13 బంతుల్లో 6 పరుగుల స్కోరు వద్ద పంత్ నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Judged beautifully by Tim Southee and Pant goes for 6! 👏
— BLACKCAPS (@BLACKCAPS) November 20, 2022
IND 36/1 (5.1) Follow play LIVE on @sparknzsport and @TodayFM_nz in NZ or with @PrimeVideoIN in India #NZvIND pic.twitter.com/04CsUOxOfa
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్, శుభ్మన్ గిల్లను పక్కనపెట్టి మరీ పంత్ను ఓపెనర్గా పంపడం జరిగింది. అయినా సరే అతను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. పంత్ అవుటవడంతో మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అతను కూడా ఒక బౌండరీ బాదడంతో భారత జట్టు 42/1 స్కోరు వద్ద పవర్ప్లే ముగించింది.
ఈ మైదానంలో చివరగా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అంతా అనుుకున్నారు. కానీ కేన్ విలియమ్సన్ మాత్రం తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. మూడు టీ20ల సిరీస్లో వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బే ఓవల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ మధ్యలో ఒకసారి జల్లులు కూడా పడ్డాయి. మరి మ్యాచ్ పూర్తిగా జరుగుతుందో లేదో చూడాలి.