న్యూజిల్యాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లో రిషభ్ పంత్ (15), సూర్యకుమార్ యాదవ్ (4) పెవిలియన్ చేరారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు శుభ్మన్ గిల్ (50), శిఖర్ ధవన్ (77) శుభారంభం అందించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కాసేపటికే వికెట్లు పారేసుకున్నారు. గిల్ను లోకీ ఫెర్గూసన్ అవుట్ చేయగా.. సౌథీ బౌలింగ్లో ధవన్ అవుటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ ఇద్దరూ కూడా నిదానంగా బ్యాటింగ్ చేశారు. దీంతో 32 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 152/2 స్కోరుతో నిలిచింది. ఇలాంటి సమయంలో స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించిన పంత్.. లోకీ ఫెర్గూసన్ వేసిన 33వ ఓవర్లో ఒక బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతి షార్ట్ బాల్ కావడంతో పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ టైమింగ్ సరిగా కుదరక పోవడంతో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో టుక్కు టుక్కుమంటూ సాగిన పంత్ ఇన్నింగ్స్కు తెరపడింది.
పంత్ అవుటవగానే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. అతని నుంచి మరో భారీ ఇన్నింగ్స్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తను ఎదుర్కొన్న మూడో బంతికే అతను కూడా పెవిలియన్ చేరాడు. ఫెర్గూసన్ వేసిన లెంగ్త్ బాల్ను ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫిన్ అలెన్ వైపు దూసుకెళ్లింది. దాన్ని అతను చక్కగా క్యారీ చేయడంతో సూర్యకుమార్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్రమంలోనే భారత జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి 170/4 స్కోరుతో నిలిచింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (21 నాటౌట్)తోపాటు సంజూ శాంసన్ ఉన్నాడు.