
ఫిట్నెస్ సమస్య..
రెండో వన్డేలో రోహిత్ గాయం పక్కన పెడితే.. ఈ సిరీస్లో కొంతమంది ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాదిలో దీపక్ చాహర్ ఆడిన మ్యాచుల కన్నా గాయంతో దూరమైన మ్యాచులే ఎక్కువ. ఇలా సగం సగం ఫిట్నెస్తో ఆటగాళ్లు ఉండటం జట్టుకు నష్టమని రోహిత్ శర్మ కూడా చెప్పాడు. దీని వల్ల గాయాలే కాదు, ఆటగాళ్ల ఫీల్డింగ్పై కూడా ప్రభావం పడుతుంది. ఇది చూసిన అభిమానులకు ఆటగాళ్ల రీహాబ్ విధానంపై అనుమానాలు వస్తున్నాయి. వచ్చే వన్డే వరల్డ్ కప్లో నూరు శాతం ఫిట్గా లేని ఆటగాళ్లను ఆడిస్తే అది జట్టుకు నష్టమే అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

చేజేతులారా ఓడిపోవటం..
విజయానికి అడుగు దూరంలోకి వచ్చి.. అక్కడ పట్టు సడలించడంతో టీమిండియా ఓటములు మూటగట్టుకుంటోంది. బంగ్లాదేశ్తో తొలి వన్డేలో 136 పరుగులకే 9 వికెట్లు తీసిన భారత్.. ఆ చివరి వికెట్ తీయడంలో విఫలమైంది. దీంతో బంగ్లా విజయం సాధించింది. రెండో వన్డేలో 69/6తో ఉన్న బంగ్లాపై మరింత ఒత్తిడి పెంచి ఆలౌట్ చేయాల్సిందిపోయి.. వాళ్లకు అవకాశం ఇచ్చింది. దీంతో ఆ జట్టు 271 పరుగుల మంచి స్కోరు చెయ్యగలిగింది. ఇలా విజయం వరకు వచ్చి వెనుతిరగడం భారత్కు అలవాటుగా మారింది. దీన్ని మార్చుకోకుంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం కనబడుతోంది.

శ్రేయాస్ అయ్యర్ కీలకం..
బంగ్లా సిరీస్లో కనిపించిన ఏకైక పాజిటివ్ అంశం.. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్. నాలుగో నెంబర్ స్థానాన్ని ఉడుములా పట్టేశాడీ కుడి చేతి వాటం బ్యాటర్. ఈ ఏడాది ఆరంభం నుంచి జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చిన అతను.. బంగ్లాతో తొలి వన్డేలో ఫర్వాలేదనిపించాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. టాపార్డర్ విఫలమైన తర్వాత భారత ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. దీంతో అతన్ని వన్డే జట్టు నుంచి తొలగించడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో ఇలాంటి ఆటగాళ్లు చాలా కీలకంగా మారతారు.


Click it and Unblock the Notifications












