
భారత్, సౌతాఫ్రికా సమరానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో టీమిండియా సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. నేడు ఉదయం ముంబై నుంచి ఒక ప్రైవేట్ విమానంలో సౌతాఫ్రికా బయలుదేరిన భారత జట్టు సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. సౌతాఫ్రికా విమానం ఎక్కడానికి ముందే టీమిండియా ముంబైలో క్వారంటైన్ పూర్తిచేసుకుంది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా సౌతాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ల్యాండ్ అయింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తోపాటు మిగతా సహాయక బృందం కూడా టీం వెంటనే అక్కడికి చేరుకుంది.
అయితే సౌతాఫ్రికాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగుతుండడంతో అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని రోజులు టీమిండియా క్వారంటైన్లోనే ఉండనుంది. క్వారంటైన్లో ప్రతిరోజు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. క్వారంటైన్ ముగిశాక కూడా పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వచ్చాక టీమిండియా ప్రాక్టీస్ మొదలవుతుంది. మొత్తం సౌతాఫ్రికాతో టీమిండియా మూడు టెస్టులు ఆడనుంది. ఈ మూడు టెస్టు మ్యాచ్లకు కేప్టౌన్, జోహన్నెస్బర్గ్, సెంచూరియన్ వేదికలుగా నిలవనున్నాయి. ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే సందర్భంగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
క్రికెట్ ఆడే అన్ని దేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఇప్పటివరకు సౌతాఫ్రికాలో ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. ధోని కెప్టెన్సీలో ఒకసారి అక్కడ టీమిండియా టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టెస్టుల్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. దీంతో ఈ సారి ఎలాగైనా టెస్టు సిరీస్ నెగ్గి ఆ లోటును తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. దీనికి తోడు ప్రస్తుతం భారత్తో పోలిస్తే సఫారీల జట్టు బలహీనంగా ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
టెస్ట్ క్రికెట్లో భారత్, సౌతాఫ్రికా ఇప్పటివరకు 39 సార్లు తలపడ్డాయి. ఇరుజట్లు దాదాపుగా సమానంగా మ్యాచ్లు గెలిచాయి. సౌతాఫ్రికా 15 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. భారత్ 14 మ్యాచ్ల్లో గెలిచింది. 10 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సౌతాఫ్రికా విజయాల శాతం 38గా ఉండగా, భారత్ విజయాల శాతం 35గా ఉంది. ఇరుజట్లు మొదటిసారి టెస్టు క్రికెట్లో 1992లో తలపడగా.. చివరగా 2019లో తలపడ్డాయి.