
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఏకంగా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు కచ్చితంగా ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బలం అనుకున్న బ్యాటింగే భారత్ను ముంచింది. ఒక్కరంటే ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఫామ్లో ఉన్నారని అనుకున్న గిల్, రోహిత్, రాహుల్, హార్దిక్ ఘోరంగా ఫెయిలయ్యారు.
కేవలం కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29 నాటౌట్) మాత్రమే 20 పరుగుల మార్క్ దాటారంటేనే భారత బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే టీమిండియా కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లు అలవోకగా ఛేదించారు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో కేవలం 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఇది భారత్కు మిగిలిన బంతుల పరంగా అతి పెద్ద ఓటమి. ఈ మ్యాచ్లో 234 బంతులు మిగిలుండగానే ఆస్ట్రేలియా గెలిచింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ రెండు జట్లు కూడా పూర్తి 50 ఓవర్లు ఆడలేదు. అసలు రెండూ కలిపినా 50 ఓవర్లు ఆడలేదు. భారత జట్టు కేవలం 26 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆస్ట్రేలియా 11 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. అంటే ఈ రెండు జట్లు కలిపి కేవలం 37 ఓవర్లు మాత్రమే ఆడాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా భారత బ్యాటర్లను టార్గెట్ చేస్తూ తెగ తిట్టిపోస్తున్నారు. 'బ్యాటర్లంతా ఐపీఎల్ మూడ్లోకి వెళ్లిపోతే ఇలాగే ఉంటుంది' అంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరైతే 'చెంచా నీళ్లలో దూకి చచ్చిపోండి' డైరెక్ట్గా తిట్టేస్తున్నారు. ఇలా పది వికెట్ల తేడాతో ఓడిపోవడం టీమిండియాకు అలవాటుగా మారిందంటూ దెప్పిపొడుస్తున్నారు.