IND vs ENG: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-2తో వెనుకబడిన భారత జట్టుకు నాలుగో టెస్టుకు ముందు పేసర్లు వరుసగా గాయపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ గాయపడగా.. మరో ఆటగాడు ఆకాష్ దీప్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. ఇది టీమ్ మేనేజ్మెంట్కు పనిభారం కారణంగా విశ్రాంతి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మళ్లీ బరిలోకి దించాల్సిన అనివార్య పరిస్థితిని సృష్టించింది.
అర్ష్దీప్ సింగ్కు ఊహించని గాయం
మాంచెస్టర్లో జులై 23న ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. యువ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్కు బౌలింగ్ చేసే చేతికి గాయమైంది. సహచర ఆటగాడు సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఈ గాయమైనట్లు తెలుస్తోంది.అర్ష్దీప్ సింగ్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అతని చేతికి కుట్లు వేసినట్లు, దీని కారణంగా అతను నాలుగో టెస్ట్లో పాల్గొనడని సమాచారం. భారత జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ క్రమంలో అర్ష్దీప్ సింగ్ను స్వదేశానికి పంపించే అవకాశం ఉంది. అర్ష్దీప్ సింగ్ స్థానంలో అన్షుల్ కాంబోజ్ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇప్పటివరకు టెస్టుల్లో అరంగేట్రం చేయనప్పటికీ, బుమ్రా పనిభారాన్ని తగ్గించే లక్ష్యంతో, అర్ష్దీప్ను నాల్గవ టెస్ట్లో బరిలోకి దించుతారని చాలా మంది ఆశించారు. అతని ఎడమ చేతి పేస్ బౌలింగ్ ఇంగ్లాండ్ పిచ్లలో జట్టుకు కొత్త కోణాన్ని ఇస్తుందని కూడా భావించారు.

ఆకాష్ దీప్ గాయం
మరో పేసర్ ఆకాష్ దీప్ లార్డ్స్ టెస్టు మ్యాచ్ సమయంలో జరిగిన గాయంతో బాధపడుతున్నందున, అతను కూడా నాల్గవ టెస్ట్లో ఆడటం అనుమానంగా మారింది. లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ సమయంలోనే అతను అసౌకర్యంగా భావించి మైదానం వీడాడు. ఆకాష్ దీప్ గతంలో కూడా గాయాల కారణంగా ఇబ్బందులు పడ్డారని గమనించాలి. ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన ఇండియా ఎ జట్టులో అన్షుల్ సభ్యుడు. ఆ రెండు మ్యాచ్లలో 5 వికెట్లు సైతం పడగొట్టాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై అతనికి మంచి అవగాహన ఉంది. దీంతో అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ.
వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్టు తొలిరోజు ఆటలో పంత్ వేలికి గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్లో 34 ఓవర్ల తర్వాత కీపింగ్ చేయలేదు. పంత్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతను ఆడకపోతే ధ్రువ్ జురేల్ తుది జట్టులో అతడి స్థానంలో ఆడతాడు.
బుమ్రా పనిభారం
భారత జట్టు పేస్ బౌలింగ్ దండయాత్రకు వెన్నెముక అయిన జస్ప్రీత్ బుమ్రాను ఈ సిరీస్లోని ఐదు మ్యాచ్లలో మూడింటిలో మాత్రమే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది. అతని పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అతను ఇప్పటికే రెండు మ్యాచ్లలో ఆడాడు.ప్రస్తుతం సిరీస్ను సమం చేయాల్సిన అనివార్యత భారత్కు ఉండటంతో, మాంచెస్టర్లో జరిగే కీలకమైన నాల్గవ టెస్ట్లో బుమ్రాను ఆడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిరీస్ ప్రమాదంలో ఉన్నందున, బుమ్రాను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించే అవకాశం ఉంది. మాజీ భారత ఆటగాడు అనిల్ కుంబ్లే వంటి నిపుణులు, సిరీస్ ప్రాముఖ్యతను బట్టి బుమ్రా మిగిలిన రెండు మ్యాచ్లలోనూ ఆడాలని చెప్పారు.
జట్టు పరిస్థితి ఏమిటి?
అర్ష్దీప్ సింగ్, ఆకాష్ దీప్ గాయపడినందున భారత జట్టు పేస్ బౌలింగ్ బలహీనపడింది. ప్రసిద్ధ్ కృష్ణ మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. మహ్మద్ సిరాజ్ మూడు టెస్టుల్లోనూ ఎక్కువ ఓవర్లు వేసి, తీవ్రమైన పనిభారంతో కనిపిస్తున్నాడు.ఈ క్లిష్ట పరిస్థితి నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం జట్టు ఎంపికలో కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్కు పెద్ద తలనొప్పిని సృష్టించింది. బ్యాటింగ్లో కరుణ్ నాయర్ పేలవమైన ఫామ్ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా, బౌలింగ్లో ఎదురైన ఈ ఎదురుదెబ్బ భారత జట్టు సిరీస్ను గెలుచుకునే కలలకు పెద్ద సవాలుగా మారింది.