సౌథాంప్టన్: ప్రపంచకప్ టోర్నమెంట్ హాట్ ఫేవరెట్గా టైటిల్ వేట కోసం కొదమ సింహాల్లా బరిలో దిగింది భారత క్రికెట్ జట్టు. వర్షం వల్ల రద్దయిన న్యూజీలాండ్తో జరగాల్సిన మ్యాచ్ను పక్కన పెడితే.. ఆడిన అన్నింట్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. రికార్డులు బద్దలయ్యేలా భారీ స్కోర్లను సాధించింది. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టింది. బలమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లను మట్టి కరిపించేసింది టీమిండియా.
ఆ రెండు భారీ రికార్డులకు విరాట్ గండం: బద్దలు కావడం ఖాయం!
ఒక్క ఇంగ్లండ్, కొద్దో గొప్పో వెస్టిండీస్ మినహా బలమైన జట్లతో ఇదివరకే మ్యాచ్లన్నీ ముగించుకున్న టీమిండియా తన తదుపరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఎదుర్కొనడానికి సన్నాహాలు చేస్తోంది.ఇంగ్లండ్లోని సౌథాంప్టన్లో శనివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఇదిలావుండగా- పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం ఆరు రోజుల పాటు వ్యవధి చిక్కింది టీమిండియాకు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు రోజుల పాటు నెట్ ప్రాక్టీస్లో మునిగి తేలింది. ఇన్నాళ్లూ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి, పైచేయి సాధించడానికి వ్యూహ, ప్రతివ్యూహాల్లో గడిపిన క్రికెటర్లు, టీమ్ మేనేజ్మెంట్.. శుక్రవారం సరదాగా గడిపింది. సౌథాంప్టన్కు చెందిన పలువురు పాఠశాల విద్యార్థులు స్టేడియానికి వచ్చారు. కోచ్ రవిశాస్త్రి, కేప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్లు హార్ధిక్ పాండ్య, కేఎల్ రాహుల్ తదితరులు వారితో కలిసిపోయారు. సరదాగా గడిపారు. క్రికెట్ ఆడారు. గ్రూప్ ఫొటో దిగారు. వారికి కొన్ని చిట్కాలను వివరించారు.