దుబాయ్: మంగళవారం విదులైన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా ఒక స్థానంను మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మంగళవారం ముగిసిన నాలుగో టెస్టులో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్ని 2-1తో చేజిక్కించుకుంది. తాజా విజయంతో 117.65 పాయింట్లను ఖాతాలో వేసుకుని మూడో స్థానం నుంచి రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.
117.65 పాయింట్లతో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి టీమిండియా ఎగబాకగా.. 113 పాయింట్లతో రెండు నుంచి మూడుకి ఆస్ట్రేలియా పడిపోయింది. ఇక న్యూజిలాండ్ 118.44 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. భారత్, కివీస్కి మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 0.79 పాయింట్లే. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ (106), దక్షిణాఫ్రికా (96), శ్రీలంక (86), పాకిస్థాన్ (82), వెస్టిండీస్ (77), బంగ్లాదేశ్ (55) ఉన్నాయి.
మెల్బోర్న్ టెస్టులో విజయం తర్వాత భారత్ జట్టు నెం.1 స్థానానికి దూసుకొస్తుందని అంతా ఊహించారు. అయితే సిడ్నీ టెస్టుని చివరి రోజు డ్రాగా ముగించిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టులోనూ కేవలం 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ని రెండు టెస్టుల సిరీస్లో భారీ తేడాతో ఓడించిన న్యూజిలాండ్.. ఎక్కువగా పాయింట్లని దక్కించుకుంది. దాంతో తన స్థానాన్ని కాపాడుకుంది. తొలి టెస్టులో 101 పరుగుల తేడాతో గెలిచిన కివీస్.. రెండో టెస్టులో ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాను కిందికి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించిన భారత జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో అగ్రస్థానానికి ఎగబాకింది. చాంపియన్షిప్లో భాగంగా మొత్తం 13 మ్యాచ్లు ఆడిన టీమిండియా 9 మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒకటి డ్రా అయింది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 420 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. బ్రిస్బేన్ టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 332 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'