టీమిండియా మాజీ లెజెండ్, బాలీవుడ్లో కూడా తళుక్కుమన్న ప్లేయర్ సలీం దురానీ కన్నుమూశారు. 88 ఏళ్ల సలీం తన సోదరుడితో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో మెట్లు దిగుతూ కింద పడిన ఆయనకు తొడ ఎముక విరగడంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపించిందట. ఈ క్రమంలోనే సలీం కన్నుమూసినట్లు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వాళ్లు చెప్తున్నారు.
సలీం వయసులో ఉండగా భారత్ తరఫున 29 టెస్టుల్లో మెరిశాడు. మైదానంలో దిగిన తర్వాత ప్రేక్షకులు అడిగితే భారీ సిక్సర్లు కొట్టడం సలీం ప్రత్యేకత. ఆయన కెరీర్లో కేవలం బ్యాటర్గానే కాకుండా.. ఎడం చేతి వాటం ఆర్థడాక్స్ బౌలర్గానూ సలీం మెరిశాడు. ఇంగ్లండ్తో 1961-62లో జరిగిన ఐదు టెస్టుల సిరీసును భారత జట్టు 2-0తో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలిచిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచులో ఎనిమిది, రెండో మ్యాచులో 10 వికెట్లతో రాణించాడు.

తన కెరీర్లో కేవలం ఒక్క శతకం మాత్రమే సాధించిన సలీం దురానీ.. ఏడు అర్ధశతకాలు నమోదు చేశాడు. అప్పట్లో అత్యంత బలంగా కనిపించే వెస్టిండీస్ను పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారత్ ఓడించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. కాబూల్లో పుట్టిన సలీం దురానీ.. సినిమా హీరోలా ఉన్నాడని అప్పట్లో ప్రేక్షకులు అనుకునేవారు. అందుకే అతను 1973లో చరిత్ర అనే సినిమాలో అప్పటి ప్రముఖ యాక్టర్ ప్రవీణ్ బాబితో కలిసి నటించారు.
ఈ లెజెండరీ క్రికెటర్ మరణవార్తపై ప్రముఖ క్రికెటర్లు స్పందించారు. టీమిండిమా మాజీ హెడో కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. 'భారత్ చూసిన మోస్ట్ కలర్ఫుల్ క్రికెటర్ సలీం దురానీ.. రెస్ట్ ఇన్ పీస్. ఓం శాంతి' అని ట్వీట్ చేశాడు. టీమిండియా లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా సలీం దురానీ మరణంపై ట్వీట్ చేశాడు. 'భారత్లో మొట్టమొదటి అర్జున అవార్డు అందుకున్న క్రికెటర్. ప్రేక్షకులు అడిగితే భారీ సిక్సర్లు బాదే ప్లేయర్ సలీం దురానీ.. ఓం శాంతి. ఆయన కుటుంబం, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టాడు.