IND vs AUS 3rd ODI: టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ను దారుణంగా ప్రారంభించింది. ఇప్పటికే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ను రెండు వన్డేలు ఓడిపోయి భారత్ కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో సిరీస్లోని చివరిదైన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చివరి మ్యాచ్ అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ క్రమంలో సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాపై టీమిండియా రికార్డు ఎలా ఉందో తెలుసుకుందాం.
భారత్ vs ఆస్ట్రేలియా.. సిడ్నీలో వన్డే హెడ్ టు హెడ్ రికార్డు
సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత జట్టు సన్నద్ధమవుతున్న తరుణంలో అక్కడి గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిడ్నీ మైదానంలో ఆస్ట్రేలియా జట్టుపై టీమిండియా రికార్డును పరిశీలిస్తే..
ఆడిన మొత్తం మ్యాచ్లు: 19
*భారత్ గెలిచిన మ్యాచ్లు: కేవలం 2
*భారత్ ఓడిన మ్యాచ్లు: 16
*ఫలితం తేలని మ్యాచ్లు: 1

ఈ లెక్కలను బట్టి చూస్తే సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుదే పైచేయిగా ఉంది. అందుకే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా.. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్ను 0-3 తేడాతో క్లీన్ స్వీప్ కాకుండా తప్పించుకోవడంతో పాటు, సిడ్నీలో తమ రికార్డును కూడా మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1. పెర్త్ వన్డేలో వైఫల్యం:
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డే పెర్త్లో జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. బౌలింగ్లోనూ ప్రభావం చూపలేకపోయిన టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
2. అడిలైడ్ వన్డేలో పోరాడి ఓటమి:
రెండో వన్డే అడిలైడ్లో జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీల సహాయంతో 264 పరుగులు చేయగలిగింది. అయితే ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బౌలర్లు 8 వికెట్లు తీసినప్పటికీ.. మ్యాచ్ను తమవైపు తిప్పుకోలేక 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న శుభ్మన్ గిల్ సేన.. సిడ్నీలో సవాలుగా ఉన్న ఈ రికార్డును అధిగమించి, కనీసం ఒక విజయాన్నైనా నమోదు చేస్తుందో లేదో వేచి చూడాలి.