
వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ అవుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మరో స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ కూడా వన్డే వరల్డ్ కప్లో పాల్గొనడంపై అనుమానాలు తలెత్తాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి వెన్నునొప్పి కారణంగా అతను టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో న్యూజిల్యాండ్తో జరిగిన వన్డే సిరీస్లో శ్రేయాస్ అయ్యర్ ఆడలేదు. ఆ వెంటనే మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మొదటి టెస్టుకు అందుబాటులో లేడు. అయితే ఆ తర్వాతి మూడు టెస్టుల్లో మాత్రం పాల్గొన్నాడు. కానీ చివరి టెస్టు మధ్యలోనే వెన్నునొప్పి తిరగబెట్టడంతో మళ్లీ స్కానింగ్ కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ మ్యాచ్లో ఇక అయ్యర్ ఆడలేదు. ఇప్పుడు అతనికి శస్త్రచికిత్స అవసరం అని వార్తలు వస్తుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సుమారు ఏడాది కాలంగా టీమిండియా వన్డే, టెస్టు సెటప్లలో అయ్యర్ చాలా కీలకంగా మారాడు. ఈ క్రమంలో జూన్ 7న జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆ తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్లలో భారత జట్టుకు అయ్యర్ కీలకమైన ఆటగాడిగా మారాడు. కానీ ఇప్పుడు కనుక అతనికి సర్జరీ జరిగితే మరికొన్ని రోజుల్లో జరిగే ఐపీఎల్లో అతను ఆడటం కుదరదు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కచ్చితంగా ఆడలేడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా అనుమానమే.
ఇలా అయ్యర్ కూడా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉందని తేలడంతో కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులు, టీమిండియా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐపీఎల్లో కేకేఆర్కు ఎవరు కెప్టెన అవుతారని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తుంటే.. వన్డే వరల్డ్ కప్ ఉందంటే చాలు టీమిండియాలో నాలుగో నెంబర్ బ్యాటర్ విషయంలో ఇలాంటి తలనొప్పి వస్తోందని భారత అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్లో కూడా నాలుగో నెంబర్లో రాయుడిని ప్రయోగించి, చివరకు విజయ్ శంకర్ను ఎంపిక చేయడం.. అతను విఫలం అవడం తెలిసిందే.