టీమిండియాలో విరాట్ కోహ్లీ స్థాయి వేరు. సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్ అతనే. అంత గొప్పగా రాణించిందీ కోహ్లీనే. అలాంటి ప్లేయర్ను కలిసేందుకు మొదట్లో తను కొంచెం టెన్షన్ పడ్డానని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ చెప్పాడు. కానీ ఒక్కసారి అతనితో మాట్లాడిన తర్వాత కోహ్లీ ఎంత మంచి మనసున్న వ్యక్తో అర్థమైందని చెప్పాడు.
తాజాగా టీమిండియా వెటరన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో దిలీప్ మాట్లాడాడు. ఈ క్రమంలోనే కోహ్లీతో తన అనుబంధం గురించి, పరిచయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2021లో టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ నియామకం తర్వాత.. ఫీల్డింగ్ కోచ్గా దిలీప్కు అవకాశం దక్కింది. ఆ సమయంలో కోహ్లీని కలిసేందుకు తను కొంత టెన్షన్ పడ్డానని దిలీప్ చెప్పాడు.

'కోహ్లీ చాలా పెద్ద సూపర్ స్టార్. దీంతో ఆరంభంలో అతన్ని కలవడానికి చాలా సంకోచించా. కానీ కరోనా టైంలో మేం బ్రేక్ఫాస్ట్ టేబుల్, డిన్నర్ టేబుల్ దగ్గర కలిసేవాళ్లం. మైదానం బయట కావడంతో చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్లం. ఇష్టమైన కాఫీలు, ఇష్టం లేని కాఫీలు ఇలా అన్నమాట. వేరు వేరు విషయాలపై మాట్లాడుకునే అవకాశం దొరికేది' అని దిలీప్ గుర్తుచేసుకున్నాడు.
'ఇలా కొంత కాలం గడిచిన తర్వాత, కోహ్లీతో సమయం గడిపిన తర్వాత.. అతను ఎంత అద్భుతమైన వ్యక్తో నాకు అర్థమైంది. కోహ్లీ చాలా మంచి వాడు. సరైన టైంలో అడిగితే.. కోహ్లీ ఏ విషయంలో అయినా చాలా సలహాలు ఇవ్వగలడు. కోహ్లీ గురించి తెలియాలంటే మాత్రం.. అతనితో కొంత కాలం గడపాల్సిందే' అని దిలీప్ చెప్పాడు. అదే సమయంలో రోహిత్ కెప్టెన్సీపై కూడా దిలీప్ ప్రశంసల వర్షం కురిపించాడు.
టీంమేట్స్తో రోహిత్కు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయని దిలీప్ తెలిపాడు. 'రోహిత్ కూడా చాలా మంచి వాడు. రోహిత్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే.. తను ప్లేయర్లతో ఎక్కువ టైం గడపడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతాడు' అని దిలీప్ చెప్పుకొచ్చాడు.