
ఒక్క పారాసిటమాల్ కూడా వేసుకోలేదు:
తాజాగా రవిశాస్త్రి 'ది గార్డియన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'ఇంగ్లండ్లో పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాను. ఆ పది రోజుల్లో నాకు ఎటువంటి లక్షణాలు లేవు. కేవలం గొంతు నొప్పి ఒక్కటే ఉంది. అధిక టెంపరేచర్ కూడా లేదు. జ్వరం ఒక్కసారి కూడా రాలేదు. నా ఆక్సిజన్ ఎప్పుడూ 99 శాతంగా ఉంది. ఐసోలేషన్లో ఉన్న పది రోజుల పాటు నేను మందులు వాడలేదు. కనీసం ఒక్క పారాసిటమాల్ కూడా వేసుకోలేదు. రెండు డోసుల టీకాలు వేసుకుంటే, ఆ పది రోజులు కేవలం ఫ్లూమాత్రమే ఉంటుంది' అని శాస్త్రి తెలిపాడు. ఇటీవలే రవిశాస్త్రి వైరస్ నుంచి కోలుకున్నాడు. అయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ 2021 కోసం వెళ్లగా.. శాస్త్రి మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు.

పశ్చాత్తాపం లేదు:
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంపై రవిశాస్త్రి స్పందిస్తూ... 'ఆ ఫంక్షన్లో నేను కలుసుకున్న వ్యక్తులు బాగానే ఉన్నారు. అందుకే నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అబ్బాయిలు తమ గదుల్లో నిరంతరం ఉండటం కంటే.. బయటకు వెళ్లి వేర్వేరు వ్యక్తులను కలవడం మంచిది' అని పేర్కొన్నాడు. ఓవల్ టెస్ట్కు 5000 మంది ప్రేక్షకులు వచ్చారని, తక్కువ మంది ఉన్న పుస్తకావిష్కరణకు వెళ్లిన నాపై వేలెత్తిచూపడానికి ఏమీ లేదన్నాడు. ఆ కార్యక్రమంకు హాజరైన దాదాపు 250 మందిలో ఎవరికీ వైరస్ సోకనందున, తానేమి బయపడలేదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి.

అక్కడే ఏమైనా జరిగిఉండవచ్చు:
టీంఇండియాలో కరోనా సోకడానికి కారణం మీరేనా అని ప్రశ్శ్నించగా... 'ఆగస్టు 31 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. నాకు సెప్టెంబర్ 3న పాజిటివ్ వచ్చింది. ఈ మూడు రోజుల్లో వైరస్ లక్షణాలు బయట పడవు. కాబట్టి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాకు వైరస్ సొకలేదు. లీడ్స్లోనే వైరస్ సోకిఉండొచ్చు. జూలై 19న ఇంగ్లండ్ కరోనా ఆంక్షలను సడలించింది. హోటళ్లు, లిఫ్ట్లు అన్ని తెరుచుకున్నాయి. ప్రజలంతా స్వేచ్చగా తిరిగారు. అక్కడే ఏమైనా జరిగిఉండవచ్చు' అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బదులిచ్చాడు. ఇదో టెస్ట్ రద్దు విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని, కరోనా సోకిన ఫిజియోతో ఆటగాళ్లు మసాజ్ చేసుకున్న కారణంగా అందరూ భయపడ్డారని చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ చివరిది:
వచ్చే నెలలో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) రవిశాస్త్రిని దక్షిణాఫ్రికా పర్యటన వరకు అందుబాటులో ఉండాలని కోరినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదట. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ అన్వేషణలో పడింది. రవిశాస్త్రి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. తాజాగా ఇంగ్లీష్ గడ్డపై కూడా అద్బుతాలు చేసింది. వన్డే, టీ20ల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేసింది.


Click it and Unblock the Notifications
