టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారి జట్టు ప్రణాళికలు గురించి మాట్లాడాడు. పనిభారం దృష్ట్యా, గాయాలు కారణాలు చెబుతూ ఆటగాళ్లు కొన్ని ఫార్మాట్లలోనే ఆడతానని చెబితే సహించనని చెప్పాడు. కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడేలా సిద్ధంగా ఉండాలని గంభీర్ తెలిపాడు.
ఐపీఎల్లో అధిక సంపాదనకు ఆశపడి యువ క్రికెటర్లు టెస్టు ఫార్మాట్పై, దేశవాళీ క్రికెట్పై ఆసక్తి చూపట్లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లకు కూడా సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ ఇవ్వలేదు. మరోవైపు వైట్ బాల్ ఫార్మాట్లు అయిన వన్డే, టీ20ల్లోనే హార్దిక్ గత కొన్నేళ్లుగా ఆడుతున్న విషయం తెలిసిందే.

2018లో హార్దిక్ చివరిగా టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వరుస గాయాలు, పనిభారం అంటూ సుదీర్ఘ ఫార్మాట్కు దూరమయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో గంభీర్ కీలకవ్యాఖ్యలు చేశాడు. టాప్ క్లాస్ క్రికెటర్లు మూడు ఫార్మాట్లు ఆడటానికి సిద్ధంగా ఉంటారని అన్నాడు. ఏ ఆటగాడైనా గాయపడితే, కోలుకుని మళ్లీ తిరిగి రావాలని, కానీ మూడు ఫార్మాట్లు ఆడాలని చెప్పాడు. దీని ప్రకారమే జట్టు కూర్పు ఉంటుందని గంభీర్ పరోక్షంగా వెల్లడించాడు.
''ఓ విషయాన్ని బలంగా నమ్ముతా. మంచిగా ఉంటే ఏ క్రికెటర్ అయినా మూడు ఫార్మాట్లు ఆడాలి. ఇంజూరీ మేనేజ్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోను. మీకు ఏమైనా గాయమైతే, కోలుకుని తిరిగి రావాలి. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దానికి తగ్గట్లుగానే మీరు ఉంటారు. టాప్ ప్లేయర్లను అడిగితే, వాళ్లు కచ్చితంగా మూడు ఫార్మాట్లు ఆడటానికి సిద్ధంగా ఉంటామని చెబుతారు. అంతేకానీ రెడ్ బాల్ క్రికెట్ ఆడతా లేదు వైట్ బాల్ క్రికెట్ ఆడతానని చెప్పరు''
''ఆటగాళ్ల జీవితంలో గాయాలనేది ఓ భాగం. మీరు మూడు ఫార్మాట్లు ఆడుతుంటే గాయపడుతుంటారు. కోలుకుని మళ్లీ తిరిగి రావాలి. కానీ మూడు ఫార్మాట్లు మాత్రం కచ్చితంగా ఆడాలి. టెస్టు ఫార్మాట్లో వాళ్లని కొనసాగిద్దాం, అలాగే పనిభారం, గాయాల గురించి ఆలోచించి వాళ్లకు విశ్రాంతి ఇద్దామని నేను అనుకోను'' అని గంభీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం బుమ్రా, సిరాజ్ మాత్రమే మూడు ఫార్మాట్లు ఆడుతున్నారు.