హైదరాబాద్: టీమిండియాకు కిట్లను పంపిణీ చేసే అఫీసియల్ కిట్ స్పాన్సర్ నైకీపై బీసీసీఐతో పాటు కోహ్లీసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత పదేళ్లుగా నైకీ సంస్ధ భారత ఆటగాళ్లకు కిట్లను పంపిణీ చేస్తోంది. కిట్స్ క్వాలిటీ ఏమాత్రం బాగాలేదని, కిట్ల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యను జట్టులోని ఆటగాళ్లు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఈ విషయం బీసీసీఐకి దృష్టికి వెళ్లింది. బీసీసీఐ కూడా ఈ కిట్ల విషయమై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా జట్టులోని ఆటగాళ్లు కొన్ని కిట్లు అదనంగా అందుబాటులో ఉంచాలని కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
త్వరలోనే నైకీ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించే దిశగా చర్చలు నిర్వహిస్తామని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తెలిపారు. ఈ విషయమై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, గేమ్ ప్లాన్కి సంబంధించి జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి వచ్చే వారంలో సీఓఏ మీటింగ్లో చర్చిస్తామని చెప్పారు.
2006 జనవరి నుంచి నైకీ టీమిండియా అఫీసియల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 2006లో 43మిలియన్ డాలర్లు చెల్లించి నైకీ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత 2011లో 60 మిలియన్ డాలర్లు చెల్లించి మరో ఐదేళ్లకు ఒప్పందాన్ని పెంచుకుంది.
2015లో నైకీ 57మిలియన్ డాలర్లు చెల్లించి 2020 వరకు బీసీసీఐతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంది.