
టీమిండియా వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్కు పెద్ద షాక్ తగిలింది. మార్నింగ్ వాక్ చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతని తండ్రి మహదేవ్ జాదవ్ మిస్ అయ్యాడు. ఆయన తిరిగి ఇంటికి రాలేదు. తండ్రి ఎక్కడకు వెళ్లాడో తెలియక కేదార్ జాదవ్ తెగ టెన్షన్ పడ్డాడు. వెంటనే వెళ్లి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి, కొన్ని గంటల్లోనే మహదేవ్ జాదవ్ను పట్టుకున్నారు.
కేదార్ జాదవ్ తండ్రి డిమెన్షియా అనే వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది జ్ఞాపకాలు, ఆలోచనకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల సడెన్గా తాము ఏం చేస్తున్నారో రోగులు మర్చిపోతారు. ఈ క్రమంలోనే మార్నింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహదేవ్ జాదవ్.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేశారు. తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఎక్కడికో వెళ్లిపోయారు. తండ్రి కనబడక పోవడంతో కేదార్ తెగ టెన్షన్ పడిపోయి, పోలీసులను ఆశ్రయించాడు.
వెంటనే రంగంలోకి దిగిన అలంకార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజిలు పరిశీలించారు. పూణేలో ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల మొత్తం వెతికి మహదేవ్ జాదవ్ను పట్టుకున్నారు. ఈ విషయాన్ని జాదవ్ తన ఇన్స్టాగ్రాంలో వెల్లడించాడు. 'నా కోసం ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు. దీన్ని ఎప్పటికీ మర్చిపోను' అని ఇన్స్టా స్టోరీలో కేదార్ జాదవ్ పోస్టు పెట్టాడు. దీంతోపాటు పోలీసుల మధ్య కుర్చీలో కూర్చొని ఉన్న తండ్రి ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు తమకు కూడా టెన్షన్ తగ్గిందని అంటున్నారు.
అయితే ఒక వార్తా సంస్థ ఈ వార్తను రాస్తూ.. మహదేవ్ ఇక్కడి అపార్ట్మెంట్ సెక్యూరిటీని ఏమార్చి బయటకు వెళ్లిపోయారని, ఆయన బయటకు వెళ్లిన వెంటనే మొబైల్ కూడా స్విచాఫ్ అయిపోయిందని పేర్కొంది. ఏదేమైనా చివరకు మహదేవ్ దొరకడంతో అందరూ సంతోషిస్తున్నారు. కేదార్ జాదవ్ తన కెరీర్లో 2014 నుంచి 2020 వరకు భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. మొత్తం 74 వన్డేలు, 9 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్య వహించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన జట్టులో కూడా కేదార్ జాదవ్ సభ్యుడిగా ఉన్నాడు.