
హైదరాబాద్: టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. విహారి అయిదు సీజన్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో తిరిగి హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 2015-16 సీజన్లో హైదరాబాద్ను వీడిన విహారి.. ఆంధ్ర జట్టులో చేరాడు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని (హెచ్సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ నడిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్కు ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. విహారికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు.
హైదరాబాద్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నట్లు హనుమ విహారి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 'ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని వీడుతున్నా. గత అయిదేళ్లు ఆంధ్రకు ఆడడం, నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా' అని విహారి ట్విట్టర్లో తెలిపాడు. 'వచ్చే సీజన్ నుంచి హైదరాబాద్కు ఆడతా. ఈ విషయం పంచుకోవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్లోనే చదువు, కోచింగ్ నేర్చుకున్నా' అని విహారి పేర్కొన్నాడు. ఇంతకాలం తనకు మద్దతిచ్చిన ఆంధ్ర క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్లు, ఆటగాళ్లు, కోచ్లకు విహారి కృతజ్ఞతలు తెలిపాడు.
27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 94 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 55 సగటుతో 7261 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు ఉన్నాయి. 80 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 3001 పరుగులు చేశాడు. విహారి తిరిగి హైదరాబాద్కు రావడంలో హెచ్సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. డిసెంబరు-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక కాకపోతే.. వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ రంజీ జట్టుకు విహారి సారథ్యం వహించే అవకాశం ఉంది. అంతకన్నా ముందు అతడు ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో ఆడతాడు.
హనుమ విహారి భారత్ తరఫున టెస్టుల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. విదేశాల్లో మంచి ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు ఎంపికైన విహారి.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. పూర్తిగా రిజర్వ్ బెంచ్కే పరిమితమ్యాడు. జట్టులో తీవ్ర పోటీ కారణంగా అతడికి చోటు దక్కలేదు. ఇక కరోనా కారణంగా ఇంగ్లండ్తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో.. విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విహారి అత్యధిక స్కోర్ 11. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు.