అనూహ్య ఓటమి..
ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టీమిండియా.. న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి అనూహ్యం. భారత్ ఓడిపోతుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఆ మ్యాచ్ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. లీగ్ దశలో తిరుగులేని జట్టుగా అగ్రస్థానాన్ని ఆక్రమించిన భారత జట్టు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన బ్లాక్ క్యాప్ చేతుల్లో మట్టి కరిపించింది. ఈ పరాజయం భారత జట్టును కూడా విషాదంలో ముంచెత్తింది. ఫైనల్ మ్యాచ్కు ముందే- టీమిండియా స్వదేశానికి రానుంది.
సంజయ్ బంగరే ఎందుకు?
భారత జట్టు టీమ్ మేనేజ్మెంట్లో సహాయ కోచ్ పాత్రను పోషిస్తున్నారు సంజయ్ బంగర్. రవిశాస్త్రి ప్రధాన కోచ్గా ఉన్నారు. భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్గా, ఆర్ శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. సహాయక కోచ్గా సంజయ్ బంగర్ పనిచేస్తున్నారు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఎందురు పడేంత వరకూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో వంక పెట్టడానికి వీల్లేని పరిస్థితి టీమిండియాది. ఈ మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించడం వల్లే సెమీ ఫైనల్కు చేరుకోగలిగింది గానీ.. అక్కడే చతికిల పడింది. ఈ నేపథ్యంలో- బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ జోలికి వెళ్లే అవకాశం లేదు.
రవిశాస్త్రి, సంజయ్ బంగర్.. ఎవరో ఒకరు
ఇక మిగిలింది రవిశాస్త్రి, సంజయ్ బంగర్. ప్రధాన కోచ్ను పదవి నుంచి తొలగించడం అంటే మాటలు కాదు. పైగా టీమిండియా వంటి జట్టుకు కోచ్గా ఉన్న వ్యక్తిని ఇలా ఉన్నఫళంగా వేటు వేయడానికి సాహసం చేయకపోవచ్చు. దీనికితోడు- ఇటీవలే రవిశాస్త్రి పదవీ కాలాన్ని 45 రోజులకు పొడిగించారు కూడా. ఇక మిగిలింది- సంజయ్ బంగర్ మాత్రమే. ఆయనను తొలగించడానికి సరైన కారణాలేవీ లేవు. అయినప్పటికీ- ఆయనను బలి పశువును చేసే అవకాశాలు లేకపోలేదు. బీసీసీఐలోని ఓ వర్గం సంజయ్ బంగర్కు మద్దతు పలుకుతోంది. న్యూజిలాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలు కావడానికి ఏ ఒక్కర్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం గానీ, బాధ్యుడిని చేయాల్సిన పని గానీ లేదని అంటున్నారు.
విజయ్ శంకర్ గాయాన్ని అడ్డుగా పెట్టుకుని..
మడమలో గాయం వల్ల ప్రపంచకప్ టోర్నమెంట్ మధ్యలో తప్పుకొన్న తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఎపిసోడ్ను సాకుగా చూపించి, సంజయ్ బంగర్ను తప్పించవచ్చని తెలుస్తోంది. విజయ్ శంకర్ గాయంపై సంజయ్ బంగర్ వివాదాస్పద ప్రకటన చేశారనే అభియోగం ఆయనపై ఉంది. విజయ్ శంకర్ గాయంపై కోచ్, సహాయక కోచ్ మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయని, వారిద్దరూ మీడియాకు వేర్వేరుగా ప్రకటనలు చేయడానికి దారి తీసిందని అంటున్నారు. ఫలితంగా- విజయ్ శంకర్ను ఉద్దేశపూరకంగా తొలగించారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించినట్టయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో- సంజయ్ బంగర్కు బీసీసీఐ బలి పశువును చేసే అవకాశాలు దాదాపు ఖాయమేనని తెలుస్తోంది.