డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా ఆటతీరుపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో భారత జట్టు ఆటతీరు గురించి మాజీ లెజెండ్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటలో ఇంటెంట్ లోపించిందని చెప్పాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు భారత బౌలర్లు ఏమాత్రం రాణించలేదు. దీంతో ఆ రోజు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ చెలరేగాడు. స్టీవ్ స్మిత్ కూడా అదరగొట్టాడు. దీంతో ఆసీస్ జట్టు ఆ రోజు ఆట ముగిసే సమయానికి 327 పరుగులు చేసింది.

మంచి ఫామ్లో ఉన్న మహమ్మద్ షమీ, సిరాజ్ కూడా ఈ ఇన్నింగ్స్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఇదే విషయాన్ని గంగూలీ కూడా గుర్తుచేశాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్, సిరాజ్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆ తర్వాతనే భారత బౌలర్లు ఇంటెంట్ చూపించారని, తొలి రోజు నుంచి అలాగే బౌలింగ్ చేసి ఉంటే భారత్ ఈజీగా గెలిచేదని గంగూలీ అన్నాడు.
రెండో రోజు ఆటలో బంతి వేయడానికి సిరాజ్ పరిగెత్తుకు వచ్చాడు. అయితే చివరి క్షణంలో స్టీవ్ స్మిత్ పక్కకు తప్పుకున్నాడు. దీంతో సిరాజ్కు కోపం వచ్చింది. ఈ కోపంతోనే బంతిని కీపర్ వైపు విసిరాడు. ఈ ఘటన జరిగిన తర్వాత భారత బౌలింగ్ విధానమే మారిపోయిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రతి బౌలర్ మంచి ఇంటెంట్ కనబరిచాడని చెప్పాడు.
'డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజు ఆట మొదటి సెషన్లో స్టీవ్ స్మిత్ వైపు సిరాజ్ బంతి విసిరాడు. అప్పటి నుంచి రెండు ఎండ్లలో భారత బౌలింగ్ మారిపోయింది. అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లలో ఆ ఇంటెంట్ ఏమాత్రం కనిపించలేదు. అదే తేడా' అని గంగూలీ వివరించాడు. ఏదేమైనా భారత బ్యాటర్లు కూడా దారుణంగా విఫలం అవడంతో ఈ మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిందనేది కాదనలేని సత్యం.