
ముంబై: టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పాండ్యాను ఆపారు. ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం కృనాల్ పాండ్యా, అతని భార్య పంకూరి శర్మ దుబాయ్ నుంచి ముంబైకి విమానంలో రాగా.. విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు వారిని తనిఖీ చేశారు. బంగారు ఆభరణాలు, బంగారు గాజులు, ఖరీదైన గడియారాలు వంటి విలువైన వస్తువులను వారివద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.
ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్ తరపున పాల్గొన్న కృనాల్ పాండ్యా టోర్నీ అనంతరం దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు. ముంబై ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లెక్కల్లో చూపని బంగారం ఆభరణాలు, విలువైన వస్తువులు పరిమితి కంటే ఎక్కువగా విదేశం నుంచి తీసుకొస్తుండగా.. డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. బంగారం, ఇతర విలువైన వస్తువులపై కృనాల్ను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2020 మంగళవారం ముగిసిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. విన్నింగ్ టీమ్లో కృనాల్ పాండ్యా ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడైన కృనాల్ పాండ్యా.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, స్పిన్ బౌలర్గా రాణిస్తున్నాడు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున 18 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్లో 71 మ్యాచులు ఆడాడు.
మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (68), యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (33) రాణించడంతో ఢిల్లీ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పార్టీ అనంతరం ముంబై జట్టు భారత్ బయలుదేరింది.