
ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు మిగతా రాష్ట్రాలతో పోటీ పడలేవనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవల తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో జగదీశన్ ఏకంగా 277 పరుగులు చేశాడు. అది చూసిన దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు విజయ్ హజారే ట్రోఫీ నిర్వాహకులను తప్పుబట్టారు. ఈశాన్య రాష్ట్రాల జట్లను తీసుకొచ్చి ఇలా బలమైన జట్లతో మ్యాచులు ఎలా ఆడిస్తారని ప్రశ్నించారు.
ఆ మ్యాచ్ను పూర్తిగా మర్చిపోకముందే మరో ఈశాన్య రాష్ట్రం క్రికెట్ జట్టు ఘోరంగా ఓడింది. అండర్-16 విజయ్ మర్చంట్ టోర్నీలో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. సూరత్లోని ఖోల్వద్ జింఖానా స్టేడియం వేదికగా సిక్కిం, మధ్యప్రదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 414/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టు ప్లేయర్లు మనాల్ చౌహన్ 170 పరుగులు చేయగా.. ప్రతీక్ శుక్లా 86 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సిక్కిం జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు.
దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 43 పరుగులకే ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆదిత్య భండారీ ఐదు వికెట్లు తీసుకోగా.. ఆయమ్ సర్దానా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన సిక్కిం.. ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో ఆ జట్టు కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. మధ్యప్రదేశ్ బౌలర్ గిరిరాజ్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకోవడం గమనార్హం. మరో బౌలర్ ఆలిఫ్ హసన్ ఐదు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్ 365 పరుగుల తేడాతో విజయం సాధించింది.