హైదరాబాద్: ఓ టీవీ షో కోసం స్టార్ క్రికెటర్లు గరిటె పట్టనున్నారు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఒక టీవీ షోతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ టీవీ షోకి 'టేస్ట్ మ్యాచ్' అని పెట్టారు. ఈ 'టేస్ట్ మ్యాచ్' లో టీమిండియా ఆటగాళ్లు గరిటె చేతపట్టనున్నారు.
'టేస్ట్ మ్యాచ్' పేరుతో ప్రసారం కానున్న టీవీ షో కార్యక్రమానికి పాటిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ షోలో పాల్గొని వంట చేసే సెలబ్రెటీలందరూ మన టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కావడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా భారత ఆటగాళ్ల వంటగదిలో చేసే సాహసాలను అభిమానులతో పంచుకోవచ్చు.
షో మధ్యలో డ్రస్సింగ్ రూమ్లో జరిగే విషయాలను ఈ సందర్భంగా ఆటగాళ్లు అభిమానులతో పంచుకోనున్నారు. మహిళా క్రికెటర్లు సైతం ఈ షోలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఆ టీవీ ఛానెల్ రూపొందించిన ప్రొమో సోషల్మీడియాలో ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ షూటింగ్ జరిగే సమయంలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్లతో ఎన్నో అనుభవాలు పంచుకున్నానని, వారితో ప్రత్యేక బంధం ఏర్పడిందని తెలిపారు. రవీంద్ర జడేజా, సౌరభ్ గంగూలీ కూడా ఈ షోలో పాల్గొన్నారని ఈ షో ద్వారా వారితో సమయం గడపడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.