టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబలోని కలహాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.తన భార్య రివాబా జడేజా పరువుకు భంగం కలిగించొద్దని తన తండ్రి అనిరుధ్పై జడేజా మండిపడ్డాడు. ఈ వివాదాన్ని ముగించాలని సోషల్ మీడియా వేదికగా జడేజా కోరడం గమనార్హం.
అసలేం జరిగిదంటే.. జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు జడేజాతో ఉన్న బంధం తెగిపోయిందని తెలిపారు. దానికి కారణం తన కోడలు రివాబా జడేజా అని పేర్కొన్నారు. అసలు జడేజా క్రికెటర్ కాకపోతే బాగుండేదని అన్నారు. తన మనువరాలిని చూడక అయిదేళ్లు దాటిందని వాపోయారు. ఒకే ఊర్లో ఉంటున్నా మాట్లాడుకోవట్లేదని చెప్పారు.

" నా కడుపు రగిలిపోతుంది. అతడికి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. అసలు జడేజా క్రికెటర్ కాకపోతే బాగుండేది. అలా జరిగితే మాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పెళ్లయిన మూడు నెలల్లోనే అన్నీ తన పేరు మీదకు మార్చాలని జడేజా భార్య చెప్పింది. మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. కలిసి ఉండాలనే ఉద్దేశం తనకి లేదు. వేరుగా ఉండాలని భావించేది. నేను, నైనానా (రవీంద్ర సోదరి) చెప్పేది తప్పనుకోవచ్చు. కానీ మా ఫ్యామిలోని 50 మంది తప్పుగానే చెప్తారా? చివరికి కుటుంబంలో ద్వేషమే మిగిలింది'' అని అనిరుధ్ పేర్కొన్నారు.
దీనికి జడేజా సోషల్ మీడియా వేదికగా రవీంద్ర జడేజా స్పందించాడు. తన తండ్రి చెప్పిన మాటలు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అని ఖండిస్తూ ఓ నోట్ పోస్ట్ చేశాడు. ''ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాలు అర్ధరహితం, పచ్చి అబద్ధాలు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవి నా భార్య ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు. ఇది సరికాదు. నేను కూడా చాలా విషయాలు చెప్పాలి. కానీ అవి చెప్పకపోవడమే మంచిది'' అంటూ జడేజా పేర్కొన్నాడు.
2016లో రివాబాను జడేజా పెళ్లి చేసుకున్నాడు. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రివాబా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు జడేజా తొలి టెస్టులో గాయపడి ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. రెండో టెస్టుకు దూరమైన అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండేలా సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.