BWF World Junior Championships 2025: జూనియర్ బ్యాడ్మింట ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో ఇండియాకు చెందిన 16 ఏళ్ల షట్లర్ తన్వి శర్మ అద్భుతంగా రాణించింది. ఈ క్రమంలో భారతీయ అభిమానుల 17 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో తన్వీ శర్మ థాయ్లాండ్కు చెందిన అన్యపత్ ఫిచిత్ప్రీచాసక్ చేతిలో 7-15, 12-25 తేడాతో వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. ఈ పరాజయం తర్వాత కూడా తన్వీ పేరు చరిత్రలో నమోదైంది. అయితే ఆమె సైనా నెహ్వాల్ సాధించిన విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది.
ఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలైన తన్వీ శర్మ
భారత షట్లర్ తన్వీ శర్మ ఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. అయితే ఫైనల్ పోరులో ఆమె కాస్త నిరాశపరిచే ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆమెకు స్వర్ణానికి బదులు రజత పతకంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్లో ఓటమి తర్వాత తన్వీ శర్మ మాట్లాడుతూ.. "రజత పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ స్వర్ణం గెలవనందుకు కొంచెం నిరాశగా ఉంది. ఈ టోర్నమెంట్కు ముందు నేను పతకం గెలుస్తానని కూడా అనుకోలేదు, కాబట్టి ఈ పతకం నాకు చాలా విలువైనది" అని తెలిపింది.

17 ఏళ్ల తర్వాత..
జూనియర్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ భారతీయ మహిళా క్రీడాకారిణి పతకం గెలవడం ఇదే.తన్వీ శర్మ కంటే ముందు 1996లో అపర్ణా పోపట్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2006లో సైనా నెహ్వాల్ కూడా రజత పతకం సాధించింది. సైనా తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని 2008లో స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది. ఈ ఈవెంట్లో పతకం సాధించిన మూడో భారతీయ మహిళా క్రీడాకారిణి తన్వీ శర్మ. ఈ టోర్నమెంట్లో రజత పతకం సాధించిన భారతీయ ఆటగాళ్లలో పురుషులు కూడా ఉన్నారు: సిరిల్ వర్మ (2015), శంకర్ ముత్తుస్వామి (2022). తన్వీ శర్మ ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో రజతం సాధించిన 5వ భారతీయ షట్లర్.ఫైనల్ ఓటమి నుంచి తన్వి శర్మ గుణపాఠం నేర్చుకుని, మరింత మెరుగ్గా ఆడుతుందని ఆశిస్తున్నారు. తద్వారా సైనా నెహ్వాల్, పీవీ సింధు తర్వాత మరో మహిళా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ భారత్కు లభిస్తుంది.