న్యూ ఢిల్లీ: ఇప్పటికే వన్డే సిరీస్ విజేత అయిన భారత మహిళల జట్టు మరోసారి శ్రీలంకపై విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన టీ20సిరీస్లోని తొలి మ్యాచ్ను విజయంతో శుభారంభాన్ని నమోదు చేసింది. లంక పర్యటనలో ఉన్న టీమిండియా మహిళల జట్టు ఆతిథ్య జట్టుపై కటునాయకె వేదికగా జరిగిన తొలి టీ20లో 11పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి హర్మన్ప్రీత్ సేన విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు సాధించింది. తానియా భటియా అత్యధికంగా 46 పరుగులు(35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో కలిపి) చేయగా.. జెమిమా రొడ్రిగస్ 36, అనుజా పాటిల్ 34, వేదా కృష్ణమూర్తి 21, మిథాలీరాజ్ 17 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కేవలం సున్నా పరుగులతో 75/4 వద్ద ఇన్నింగ్స్ను ముగించింది.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 19.3 ఓవర్లలో 155 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దీంతో 11 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
జెమిమా సరికొత్త రికార్డు..
ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి జెమిమా సరికొత్త రికార్డు నమోదుచేసింది. తొలి టీ20లో జెమిమా 15 బంతుల్లో 36 పరుగులు సాధించింది. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. కాగా.. ఈ మూడు సిక్స్లు జెమిమా ఒకే ఓవర్లో బాదేసింది. ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒకే ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్గా జెమిమా రికార్డు సొంతం చేసుకుంది.