
ఢాకా: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్లేయర్స్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎవరూ ఊహించని ఈ లాక్డౌన్ సమయాన్ని ప్రతి ఒక్కరు కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. అయితే తాము ఇంట్లో చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్లోనే ఉంటున్నారు. కొందరు టిక్టాక్లతో బిజీగా ఉంటే.. మరొకొందరు ఇన్స్టాగ్రామ్లలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు.
ఫేస్బుక్ లైవ్ సెషన్లో పాల్గొన్న తమీమ్ ఇక్బాల్ తన కెరీర్ ప్రారంభ రోజుల్లో రావల్పిండి ఎక్స్ప్రెస్ను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. షోయబ్ అక్తర్ని ఎదుర్కొన్న తొలిరోజే అతని బౌలింగ్ వేగానికి తాను భయపడిపోయానన్నాడు. బౌలింగ్ వేగం చూసి అక్తర్ చంపేస్తాడేమో అని అనుకున్నాడట. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి తమీమ్ అరంగేట్రం చేయగా.. అప్పటికే అక్తర్ తన పేస్ బౌలింగ్తో ప్రపంచ మేటి బ్యాట్స్మన్లను కూడా వణికించాడు. 2003 వన్డే ప్రపంచకప్లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ... 'నేను ఎప్పుడూ ఇదే చెబుతాను. నా కెరీర్లో ఎంతో మంది బౌలర్లని ఎదుర్కొన్నా. గంటకి 150కిమీ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొన్నా. కానీ.. ఒక్కసారి మాత్రం చాలా భయపడ్డా. అక్తర్ వేగానికి భయపడిపోయా. ముఖ్యంగా మొదటిసారి అతడిని ఎదుర్కొన్నప్పుడు.. ఆ బంతులు వస్తున్న తీరు చూసి బయపడిపోయా. అతని బౌలింగ్ చాలా భయంకరంగా ఉంది. అక్తర్ నన్ను చంపేస్తాడేమో అనుకున్నా' అని తెలిపాడు. తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 60 టెస్టులు, 207 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.
2003 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అక్తర్ 161.3 కేపీహెచ్ వేగంతో బంతిని వేసి అత్యంత వేగవంతమైన పేసర్గా రికార్డుకెక్కాడు. రావల్పిండి ఎక్స్ప్రెస్ సంధించే వేగవంతమైన బౌన్సర్లకి అప్పట్లో చాలామంది అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ల వద్ద కూడా సమాధానం లేకపోయింది. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ మాత్రమే అప్పర్ కట్తో కొన్ని పరుగులు చేసేవారు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు.
ఇటీవలే షోయబ్ అక్తర్కు ఊహించని షాక్ తగిలింది. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదికగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అక్తర్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ అడ్వైజర్ పరువు నష్టం దావా వేశారు. ఉమర్ అక్మల్పై మూడేళ్ల నిషేధం విషయంలో అక్తర్ తన ఛానల్ యూట్యూబ్ వీడియోలో అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఉమర్ను సమర్థించడమే అసలుకే ఎసరొచ్చింది.