
చెన్నై: వన్డే ప్రపంచకప్లో తొలి బంతికే వికెట్ పడగొట్టిన మూడో బౌలర్గా భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో విజయ్ తన తొలి వరల్డ్ కప్ ఆడాడు. మెగా టోర్నీలో పాకిస్థాన్ను భారత్ ఓడించి మంగళవారంకు సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా విజయ్ ఆ మ్యాచ్ విశేషాలను తాజాగా పంచుకున్నాడు.
'పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కండరాలు పట్టేయడంతో ఆరంభంలోనే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. జట్టులో ఇతర పేసర్లు ఉన్నా కెప్టెన్ విరాట్ కోహ్లీ నావైపు బంతి విసిరాడు. అది నా ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంపొందించింది. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయాలనుకున్నా. అదృష్టం కొద్ది తొలి బంతికే ఇమామ్ ఉల్ హాక్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కూడా అదే విధంగా బౌలింగ్ చేశా' అని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఈ విజయంతో పాకిస్తాన్పై ప్రపంచకప్ వేదికపై వరుసగా ఏడోసారి టీమిండియాదే పైచేయి అయింది. పాక్ లీగ్ దశ నుండే ఇంటిబాట పట్టగా.. భారత్ సెమీస్లో నిష్క్రమించింది. ఇక విజయ్ శంకర్ కూడా గాయంతో టోర్నీ మధ్యలోనే స్వదేశానికి తిరిగివచ్చాడు.
టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో నెలకొన్న పోటీ గురించి ఆలోచిస్తే తనకే నష్టమని విజయ్ శంకర్ ఇటీవల తెలిపాడు. 'హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటూ ఆడితే నా ఆట దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోవడంతో పాటు సహజ సిద్దంగా ఆడలేకపోతున్నా. పాండ్యా గురించి పట్టించుకోకుండా మ్యాచ్లు ఆడుతుంటే మాత్రం గెలిపించే ప్రదర్శన కనబర్చుగలుగుతున్నా. నేను మెరుగ్గా రాణించగలిగితే అందరూ నా గురించి మాట్లాడతారు. అప్పుడు నాకు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి.. ఇతర ఆటగాళ్ల గురించి ఆలోచించడాన్ని నేను పూర్తిగా మానేశా' అని విజయ్ శంకర్ వెల్లడించాడు.
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగాటోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్లో తమిళనాడు తరఫున రెగ్యులర్గా మ్యాచ్లాడిన విజయ్ శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని ఆశించాడు. అయితే.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి