16వ ఐపీఎల్ ప్రారంభానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమయింది. ప్రారంభ మ్యాచ్ లో డిఫెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముందు ఐపీఎల్ ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో సినీ నటులు తమన్నా భాటియా, రష్మిక మంధాన ప్రదర్శన ఇవ్వనున్నారు. వీరు గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించి IPL అధికారిక ట్విట్టర్ వీడియో పోస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. అరిజిత్ సింగ్, రష్మిక మందనాతో కలిసి ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పారు. గుజరాత్ టైటాన్స్ 2022లో తమ అరంగేట్రం సీజన్లో ఐపిఎల్ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ప్రధానంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రతిభ కారణంగా సాధ్యమైందని ఆ జట్టు అభిమానులు చెబుతున్నారు. గత సీజన్ లో మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా మెగాస్టార్లుగా అవతరించారు.

గత టోర్నమెంట్ను తొమ్మిదో స్థానంలో ముగించిన నాలుగుసార్లు ఛాంపియన్లైన CSK ఈసారి టైటిల్ సాధించాలని సంకల్పంతో ఉంది. టాటా ఐపీఎల్ ఆరంభ వేడుకలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభ కానున్నాయి. ఈసారి ఐపీఎల్ టీవీల్లో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. మొబైల్ లో చూడాలంటే జియో సినిమాలో చూడొచ్చు. ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభమై.. మే చివరి వారంలో ముగియనుంది.