మాకు సత్సంబంధాలు ముఖ్యం..అఫ్గాన్ క్రికెట్కు అంతరాయం కలిగించం!షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు ఆడుకోవచ్చు!

కాబూల్: అఫ్గానిస్థాన్ దేశం పూర్తిగా తాలిబన్ల వశం అయిన విషయం తెలిసిందే. అమెరికా రక్షణ దళాలతో కూడిన చివరి విమానం అఫ్గాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బయలు దేరింది. దీంతో అఫ్గానిస్థాన్ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. తాలిబన్లు అక్కడ తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్లో నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల కారణంగా ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇంతకు ముందే షెడ్యూల్ ఖరారు చేసిన మ్యాచులు ఆడేందుకు అంతరాయం కలిగించబోమని తాలిబన్లు తాజాగా స్పష్టం చేశారు.

మాకు సత్సంబంధాలు ముఖ్యం:
ఈడాది నవంబరులో అఫ్గానిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడుతుందని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వసీఖ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 'భవిష్యత్తులో అన్ని దేశాలతో మేం సత్సంబంధాలు ఏర్పరచుకోవాలనుకుంటున్నాం. అప్పుడే అఫ్గాన్ ఆటగాళ్లు విదేశాలకు, విదేశీ ఆటగాళ్లు అఫ్గాన్కు రాగలుగుతారు. మాకు సత్సంబంధాలు ముఖ్యం' అని అహ్మదుల్లా వసీఖ్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 దశ మ్యాచులకు కూడా అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ అందుబాటులో ఉండనున్నారని సమాచారం తెలుస్తోంది.

టెస్టు మ్యాచ్ జరుగుతుంది:
మరోవైపు నవంబరులో ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో జరుగనున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 'క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మధ్య సత్సంబంధాలున్నాయి. ఇరు జట్లు కలిసి కచ్చితంగా టెస్టు మ్యాచ్ ఆడతాయి. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ సిరీస్ విజయవంతంగా ముగుస్తుంది. దాని తర్వాత దుబాయ్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో కూడా అఫ్గాన్ జట్టు పాల్గొంటుంది' అని సీఏ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఐపీఎల్ 2021లో అఫ్గాన్ క్రికెటర్లు:
తమ టీమ్కు చెందిన అఫ్గానిస్థాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతారని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఫ్గాన్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ క్రమంలోనే వారు ఈ నెల 19న ఆరంభం అయ్యే ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్లు ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధతకు సన్రైజర్స్ యాజమాన్యం తెరదించింది. 'ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేం. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు' అని సన్రైజర్స్ టీమ్ సీఈవో షణ్ముగం స్పష్టం చేశారు. మంగళవారం సన్రైజర్స్ జట్టు యూఏఈకి బయలుదేరింది.

రషీద్ ఆవేదన:
అఫ్గానిస్థాన్ దేశం, ప్రజల కోసం స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆవేదన వ్యక్తం చేశాడు. 'కాబూల్లో మరోసారి రక్తం చిందింది. దయచేసి అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపేయండి' అంటూ తాజాగా రషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్కు జత చేశాడు. అంతకుముందు కూడా రషీద్ పలు ట్వీట్లు చేశాడు. క్రికెట్ అభిమానులు రషీద్ను తమ కామెంట్లతో ఓదార్చే ప్రయత్నం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications